హైదరాబాద్: ఐపీఎస్ అధికారిని, ఆర్మీ కల్నల్ అని నమ్మించి మోసాలకు పాల్పడుతున్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడిని ఏపీలోని భీమవరం పట్టణానికి చెందిన కార్తీక్ అలియాజ్ నాగరాజుగా గుర్తించినట్లు మాదాపూర్ ఇంఛార్జి డీసీపీ శ్రీనివాసరావు వెల్లడించారు.
ప్రభుత్వ అధికారులు, ధోనీతో ఉన్నట్లుగా ఫొటోలు క్రియేట్ చేసి.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు, పదవులు ఇప్పిస్తానని కార్తీక్ పలువురి వద్ద డబ్బులు వసూలు చేసినట్లు గుర్తించినట్లు డీసీపీ శ్రీనివాసరావు తెలిపారు. అదే క్రమంలో పలు సెటిల్మెంట్లు కూడా చేసినట్లు గుర్తించామన్నారు.
సైబరాబాద్లో ఏకంగా ఓ కార్యాలయాన్ని ఓపెన్ చేసిన నిందితుడిపై దేశవ్యాప్తంగా 8 కేసులు నమోదైనట్లు డీసీపీ వెల్లడించారు. మధుసూదన్ అనే వ్యక్తిని బెదిరించడంతో.. పంజాగుట్టలో అతనిపై కేసు నమోదైందని చెప్పారు. కార్తీక్ను అరెస్టు చేసి అతని నుంచి ఒక కంట్రీ మేడ్ పిస్టల్తో పాటు 23 వస్తువులు, రూ.2 లక్షల విలువైన ప్రాపర్టీని స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు.