వాహనాల నుంచి ట్యాక్స్ వసూల్ చేయడానికి జాతీయ రహదారులపై టోల్ ప్లాజాలు ఏర్పాటుచేస్తుంటారు. అయితే ఇలాంటి ఓ నకిలీ టోల్ ప్లాజాను కొంతమంది కేటుగాళ్లు గుజరాత్ నేషనల్ హైవేపై ఏర్పాటుచేసి, కొన్ని కోట్లు కొట్టేశారు. ఈ ఘటన మోర్బి జిల్లాలో జరిగింది.
సౌరాష్ట్ర ప్రాంతంలోని పాటిదార్ కమ్యూనిటీకి చెందిన ఓ రాజకీయ నాయకుడి కుమారుడు తనకు తెలిసిన మరో నలుగురితో కలిసి ఓ నకిలీ టోల్ ప్లాజాను ఏర్పాటుచేశారు. దీని ద్వారా వారు రూ. 75 కోట్లకు పైగా వసూలు చేశారు. బంబన్బోర్-కుచ్ నేషనల్ హైవేపై మోర్బి-వాంకనర్ ఊర్ల మధ్య వఘాసియా టోల్ ప్లాజా ఉంది. అయితే ఆ టోల్ ప్లాజా తగలకుండా నిందితులు అక్కడ ఉన్న సిరమిక్ ఫ్యాక్టరీ వద్ద రోడ్డును మళ్లించి కొత్త రోడ్డు వేసి మధ్యలో నకిలీ టోల్ ప్లాజాను ఏర్పాటు చేశారు.
Read also: ఇది కదా గెలుపంటే.. ప్రత్యర్థి ఓట్ల కన్నా మెజార్టీ ఓట్లే ఎక్కువ
నకిలీ టోల్ ప్లాజాను నడుపుతున్నారనే ఆరోపణలపై గుజరాత్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఎఫ్ఐఆర్లో సిరామిక్ ఫ్యాక్టరీ యజమాని అమర్షి పటేల్తో పాటు అతని సహాయకులు రవిరాజ్సింగ్ ఝాలా, హర్విజయ్సింగ్ ఝాలా, ధర్మేంద్రసింగ్ ఝాలా, యువరాజ్సింగ్ ఝలా, మరో గుర్తు తెలియని వ్యక్తిపై కేసు నమోదు చేశారు. ఒక సంవత్సరం క్రితం నుంచే ఈ టోల్ ప్లాజా నడుస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కొన్ని రోజుల క్రితమే గుజరాత్లో నకిలీ ప్రభుత్వ కార్యాలయాలను గుర్తించి సీజ్ చేయడం గమనార్హం.