టెల్ అవీవ్: హమాస్ మిలిటెంట్ల ఏరివేత లక్ష్యంగా గాజాపై ఇజ్రాయెల్ బాంబుల వర్షం కురిపిస్తోంది. ఇప్పటి వరకు గాజాలోని 3,600 హమాస్ స్థావరాలపై 6000 బాంబులు వేసినట్లు ఇజ్రాయెల్ వైమానిక దళం పేర్కొంది. మరోవైపు ఇజ్రాయెల్ వైట్ పాస్ఫరస్ బాంబులను యుద్ధంలో ఉపయోగిస్తోందని న్యూయార్క్కు చెందిన హ్యుమన్ రైట్స్ వాచ్ అనే సంస్థ ఆరోపించింది.
Also Read.. ఫ్రాన్స్ స్కూల్లో కత్తితో రెచ్చిపోయిన ఉన్మాది
అక్టోబరు 10న లెబనాన్పై, అక్టోబరు 11న గాజాపై ఇజ్రాయెల్ ప్రయోగించిన ఆయుధాలకు సంబంధించిన వీడియోలను పరిశీలించామని, వాటిలో వైట్ పాస్ఫరస్ ఆనవాళ్లు ఉన్నాయని హ్యుమన్ రైట్స్ వాచ్ పేర్కొంది. ఇవి ప్రజల ఆరోగ్యంపై దీర్ఘకాలిక ప్రభావం చూపుతాయని ఆందోళన వ్యక్తం చేసింది.
ఇదిలా ఉండగా.. గాజాలో వైట్ పాస్ఫరస్ బాంబులు ప్రయోగించలేదని ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. గతంలో 2008-09లో గాజాపై ఇజ్రాయెల్ వైట్ పాస్ఫరస్ బాంబులను ప్రయోగించింది. కాగా, 2013లో వాటిని నిర్వీర్యం చేస్తున్నట్లు ప్రకటించింది. తాజాగా మరోసారి ఇజ్రాయెల్ వీటిని గాజాపై ప్రయోగించిందని ఆరోపణలు రావడం చర్చనీయాంశంగా మారింది.
Also Read.. చైనాలో ఇజ్రాయెల్ దౌత్యవేత్తపై కత్తితో దాడి
వైట్ పాస్ఫరస్ బాంబులు భారీగా పొగను సృష్టిస్తాయి. బంకర్లు, భవనాలను నాశనం చేసేందుకు పాస్ఫరస్ బాంబులను ఉపయోగిస్తారు. అంతర్జాతీయ చట్టాల ప్రకారం వీటి వినియోగంపై ఎలాంటి నిషేధం లేకపోవడంతో కొన్ని దేశాలు శత్రువులపై దాడులు చేసేందుకు వినియోగిస్తున్నాయి.