పొరుగున ఉన్న ముస్లిం దేశం పాకిస్థాన్లో కూడా మహా శివరాత్రిని ఘనంగా జరుపుకుంటున్నారు. భక్తులు శివనామస్మరణ చేస్తున్నారు. పాకిస్తాన్లో జరుపుకునే మహాశివరాత్రి వేడుకల కోసం భారతదేశం నుండి పెద్ద సంఖ్యలో హిందువులు లాహోర్ చేరుకుంటున్నారు. ఈ పండుగను పురస్కరించుకుని పాకిస్థాన్లోని చారిత్రాత్మక ఆలయంలో కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ మహాశివరాత్రి వేడుకల్లో పాల్గొనేందుకు 62 మంది హిందువులు బుధవారం భారత్ నుంచి వాఘా సరిహద్దు మీదుగా లాహోర్ చేరుకున్నారు.
ఎవాక్యూ ట్రస్ట్ ప్రాపర్టీ బోర్డ్ (ఈటీపీబీ) ప్రతినిధి అమీర్ హష్మీ మాట్లాడుతూ.. ‘మహాశివరాత్రి వేడుకల్లో పాల్గొనేందుకు మొత్తం 62 మంది హిందూ యాత్రికులు బుధవారం భారత్ నుంచి లాహోర్ చేరుకున్నారు.’ఈటీపీబీ నిర్వహించే మహాశివరాత్రి ప్రధాన కార్యక్రమాన్ని లాహోర్ నగరానికి 300 కిలోమీటర్ల దూరంలోని చక్వాల్లో మార్చి 9న నిర్వహించనున్నారు. చక్వాల్లో చారిత్రాత్మకమైన కటాస్ రాజ్ దేవాలయం ఉంది.ఘనంగా శివరాత్రిని జరుపుకుంటారు. ఈ కార్యక్రమానికి రాజకీయ, సామాజిక, మత పెద్దలు హాజరవుతారు.
విశ్వనాథ్ బజాజ్ నేతృత్వంలో వచ్చిన హిందువులకు వాఘా వద్ద ధార్మిక స్థలాల అదనపు కార్యదర్శి రాణా షాహిద్ సలీమ్ స్వాగతం పలికారు. యాత్రికులు మార్చి 10న లాహోర్కు తిరిగి వస్తారు. మార్చి 11న లాహోర్లోని కృష్ణ దేవాలయం, లాహోర్ కోట ఇతర చారిత్రక ప్రదేశాలను సందర్శిస్తారు. మార్చి 12న భారత్కు తిరిగి రానున్నారు. పాకిస్తాన్, భారత్ మతపరమైన ప్రదేశాలకు తీర్థయాత్ర కోసం ద్వైపాక్షిక ఒప్పందాన్ని కలిగి ఉన్నాయి. భారతదేశం నుండి సిక్కు, హిందూ యాత్రికులు ఏటా పాకిస్తాన్ను సందర్శిస్తారు. మరోవైపు, ఈ ఒప్పందం ప్రకారం ప్రతి సంవత్సరం పాకిస్తాన్ నుండి యాత్రికులు కూడా భారతదేశానికి వస్తారు. పాకిస్థాన్లోని పంజాబ్ ప్రావిన్స్లోని సిక్కు సమాజానికి చెందిన ప్రజలు స్వర్ణ దేవాలయాన్ని సందర్శిస్తారు. పాకిస్తాన్ నుండి యాత్రికులు అజ్మీర్లోని ఖ్వాజాజీ దర్గాను కూడా సందర్శిస్తారు.
ఇది కూడా చదవండి: ఈ బాలీవుడ్ నటులు శివభక్తుల..ఆ హీరోయిన్ ఇంట్లో శివలింగం ప్రతిష్టాపన.!