లోక్ సభ ఎన్నిక్లలోప్రాంతీయ పార్టీలే అధిక స్థానాలు కైవసం చేసుకుంటాయిని..ఇందులో ఎటువంటి సందేహం లేదన్నారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. అంతేకాదు.. ప్రాంతీయ పార్టీలే బలమైన పక్షంగా నిలబోతున్నాయన్నారు.ఇవాళ(శుక్రవారం) ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ…. ఇండియా, ఎన్డీయే ఈ రెండు కూటములను ప్రజలు నమ్మడం లేదన్నారు. ఈ రెండు కూటములు ఈ ఎన్నికల్లో దెబ్బతింటాయనే అభిప్రాయం వ్యక్తం చేశారు. లిక్కర్ స్కామ్ పై మాట్లాడిన కేసీఆర్… ఈ స్కామ్ సృష్టి కర్త మోడీ అని ఆరోపించారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ప్రధాని క్రూరమైన ఆట ఆడుతున్నారని, ఇందులో ఎటువంటి స్కామ్ లేదని తెలిపారు.
లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవిత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అమాయకులన్నారు. ఇది కేవలం పొలిటికల్ గేమ్ అని స్పష్టం చేశారు. రాష్ట్రం రూపొందించుకున్న లిక్కర్ పాలసీని స్కామ్ అని ఏ ఫూల్ అంటారని తీవ్రంగా స్పందించారు. ఈ కేసులో నయా పైసా రికవరీ చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈడీ, సీబీఐలు బీజేపీకి జేబు సంస్థలుగా పని చేస్తున్నాయన్నారు కేసీఆర్. కోర్టులపై తమకు నమ్మకం ఉందని కచ్చితంగా.. న్యాయం జరుగుతుందని ధీమా వ్యక్తం చేశారు. అటు కేజ్రీవాల్, ఇటు కవితలు కడిగిన ముత్యంలా బయటకు వస్తారని తేల్చి చెప్పారు.
బీజేపీతో.. బీఆర్ఎస్ సీక్రెట్ గా ఒప్పందం కుదుర్చుకున్నాయని, ప్రతి సందర్భంలో బీజేపీకి ,బీఆర్ఎస్ మద్దతుగా నిలిచిందని ప్రత్యర్థులు చేస్తున్న ప్రచారంపై కేసీఆర్ స్పందించారు. బీజేపీకి, బీఆర్ఎస్ పూర్తి స్థాయిలో ఎప్పుడూ అండగా లేదన్నారు. తెలంగాణ ఏర్పడిన తొలినాళ్ళలో కేంద్రంతో రాజ్యాంగపరమైన సత్సంబంధాలు కొనసాగించామన్నారు. రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీ కోరితేనే తాము మద్దతు ఇచ్చామని అదే సమయంలో రైతు చట్టాలను బీఆర్ఎస్ తీవ్రంగా వ్యతిరేకించిందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ విజయం పాలపొంగులాంటిదన్నారు. తమ కంటే ఎక్కువ నిధులు ఇస్తానంటే ఆశపడి తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ ను గెలిపించారని అన్నారు. అయిదు నెలల్లోనే కాంగ్రెస్ చేసిన మోసాన్ని ప్రజలు అర్ధం చేసుకున్నారని తెలిపారు. ఈ ఎన్నికలలో ఆ పార్టీకి ప్రజలు తగిన బుద్ది చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. రాజకీయాల్లో గెలుపు, ఓటములు సహజమన్నారు. తాము తిరిగి పుంజుకుని అధికారంలో వస్తామని కేసీఆర్ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దీమా వ్యక్తం చేశారు.
ఇది కూడా చదవండి: రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలను కాంగ్రెస్ మోసం చేసింది