కేదార్ నాథ్ లో ఎడతెరిపిలేకుండా మంచు కురుస్తోంది.దీంతో అధికారులు ఆరెంజ్ అలర్ట్ ని ప్రకటించారు. రిషికేష్లో యాత్రికుల రిజిస్ట్రేషన్ ను తాత్కాలికంగా నిలిపివేశారు. వాతావరణ పరిస్థితులను బట్టి యాత్ర కొనసాగుతుందని తెలిపారు. గుండె జబ్బులు ఉన్నవారు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. మరో రెండు మూడు రోజులపాటు మంచు కొనసాగే అవకాశం ఉందని రుద్రప్రయాగ్ కలెక్టర్ తెలిపారు. ఆలయ పరిసరాల్లో అడుగుతీసి అడుగు వేసే పరిస్థితి లేదని అధికారులు చెబుతున్నారు.
భారీగా కురుస్తున్న మంచు కారణంగా యాత్రికులు తమ బస ప్రాంతానికే పరిమితమయ్యారు. అంతేకాదు ఆక్సిజన్ లెవల్స్ పడిపోయాయని అధికారులు చెప్పారు. దీంతో వయసు పైబడిన యాత్రికులు కొందరు ఊపిరి అందక ఇబ్బంది పడుతున్నట్లు సమాచారం. ప్రతికూల వాతావరణం కారణంగా కేదార్నాథ్ యాత్రను ఇప్పటికే నిలిపివేశారు. కేదార్ నాథ్ లో చిక్కుకున్న యాత్రికులను గుర్రాలపై కిందికి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.