రామేశ్వరం కేఫ్ బాంబు పేలుడు కేసులో కీలక వ్యక్తిని జాతీయ దర్యాప్తు సంస్థ(NIA) అరెస్టు చేసింది. ఇవాళ ( బుధవారం) కర్ణాటకలోని బళ్లారి జిల్లాలో కస్టడీలోకి తీసుకున్నట్లు ఎన్ఐఏ అధికారి తెలిపారు. నిందితుడిని షబ్బీర్గా గుర్తించారు. ప్రస్తుతం రహస్య ప్రదేశంలో విచారిస్తున్నట్లు సమాచారం. అయితే, ఈ అరెస్టుపై ఎన్ఐఏ అధికారిక ప్రకటన చేయలేదు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న వ్యక్తికి ఇతను సహకరించినట్లు సమాచారం.
మార్చి ఒకటో తేదీన బెంగళూరులోని బ్రూక్ఫీల్డ్ లో ఉన్న రామేశ్వరం కేఫ్ లో బాంబు పేలిన ఘటనలో 9 మంది గాయపడ్డారు. ఈ కేసును కర్ణాటక హోంశాఖ ఎన్ఐఏకు అప్పగించింది. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుడి ఫొటోలను విడుదల చేశారు. అతని ఆచూకీ చెప్పిన వారికి రూ.10 లక్షల నగదు రివార్డును ఎన్ఐఏ ప్రకటించింది. ఈ కేసులో నిందితుడు ఆర్డీఎక్స్ ఉపయోగించాడని నిపుణులు గుర్తించారు. ఇప్పటికే ఈ కేసులో పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఈ క్రమంలోనే తొలి అరెస్టు చేశారు ఎన్ఐఏ అధికారులు.
ఇది కూడా చదవండి: బీఆర్ఎస్ మహిళా కార్పొరేటర్ పై దాడి