ఒకే లక్ష్యంతో ముందుకు సాగితే విజయం వరిస్తుందని, దీనికి సీఎం కేసీఆర్ జీవితమే ఉదాహరణ అని మంత్రి కేటీఆర్ అన్నారు. సీఎం కేసీఆర్ మొదట్లో సింగిల్ విండో ఎన్నికల్లో పోటీచేసి ఓడిపోయారని.. అయినా పట్టుదలతో రాజకీయాల్లో కొనసాగి, ఆ తర్వాత ఎన్నికల్లో గెలిచి మళ్లీ వెనక్కి తిరిగి చూసుకోలేదని మంత్రి అన్నారు. హైదరాబాద్ పార్క్ హయత్లో జరిగిన CMSTEI గిరిజన ఔత్సాహిక పారిశ్రామికవేత్తల సక్సెస్ మీట్లో మంత్రి సత్యవతి రాథోడ్తో కలిసి కేటీఆర్ పాల్గొన్నారు.
Read Also: సీఎం కేసీఆర్ కాన్వాయ్ను తనిఖీ చేసిన ఎన్నికల సిబ్బంది
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘ఇన్ని రోజులు ఎలక్షన్ ప్రచారంలో పాల్గొంటూ చాలా ఇబ్బంది పడ్డాను కానీ ఇలాంటి కార్యక్రమానికి రావడంతో చాలా సంతోషంగా అనిపిస్తుంది. CMSTEI ద్వారా ఎన్నో వ్యాపారాలు బయట దేశానికి కూడా వెళ్తున్నాయి. ప్రతిదాన్ని పెద్దగా ఆలోచించాలి. భవిష్యత్తు అంతా గందరగోళంగా ఉన్నా సింగిల్ మైండ్ విధానంతో ఆలోచించాలి. కేసీఆర్ సైతం ఎన్నో ఓటముల తర్వాతే ఈ స్థాయిలో ఉన్నారనే విషయం గుర్తుపెట్టుకోవాలి. కుల వ్యవస్థ అనేది కేవలం మనుషులు మాత్రమే సృష్టించారు దేవుడు దీన్ని కనిపెట్టలేదు. కులాల గురించి, కుల వ్యవస్థ గురించి నాకు రాజకీయాల్లోకి వచ్చాకే తెలిసింది. టాలెంట్ ఉంటే ఏ కులమైనా ప్రతిదీ సాధించొచ్చు. CMSTEI ప్రోగ్రాంతో 500 మంది వ్యవస్థాపకులుగా మారారు. ఈ ప్రోగ్రాంలో సక్సెస్ అయిన ప్రతి ఒక్క స్టోరీ తండాలలో అందరికీ అర్థం అయ్యేలా చెప్పాలి. ఖరీదైన కలలు కంటేనే ఏదైనా సాధ్యం అవుతుంది. దళితబంధుతో ఎంతోమంది వ్యవస్థాపకులుగా మారారు. రాష్ట్ర ప్రభుత్వం అన్నివిధాలుగా అండగా ఉంటుంది. విజయం సాధించిన వారు భవిష్యత్ తరాలకు మార్గదర్శకులు మారాలి. ఎస్టీ ఆంథ్రప్రెన్యూర్స్ కోసం ప్రత్యేకంగా ఉత్పత్తుల పార్కు పెడతాం. ఎల్లారెడ్డి మండలంలో ముగ్గురు దళితబంధు లబ్దిదారులు రైస్ మిల్ పెట్టుకున్నారు. అదేవిధంగా వాటర్వర్క్స్లో దళితబంధు కింద 150 వాహనాలు ఇచ్చాం. వచ్చే నెల 3న మరోసారి విజయం సాధించిన తర్వాత సక్సెస్ మీట్ జరుపుకుందాం’ అని మంత్రి కేటీఆర్ అన్నారు.
మంత్రి సత్యవతి రాథోడ్
గిరిజనులు చదువు తర్వాత ఉద్యోగం చేసే స్థాయి నుంచి ఉద్యోగ అవకాశాలు కల్పించే స్థాయికి ఎదిగారు. ఇండస్ట్రియల్ పార్క్స్లో కూడా గిరిజనులు తమ షట్టర్స్ని కొట్లాడి మరీ తీసుకోవాలని కేటీఆర్ ఎప్పుడూ చెప్తూ ఉంటారు. గిరిజన ప్రాంతాలను, తండాలను ఎంతో అభివృద్ధి చేశాం. కరెంటు లేని రోజు నుంచి కరెంటు చూసేలా చేశాం.