Friday, May 17, 2024

మహారాష్ట్రలో ‘తెలంగాణ మోడల్’ అమలవుతుంది

spot_img

హైదరాబాద్: మహారాష్ట్ర నుంచి బిఆర్ఎస్ పార్టీలోకి చేరికలు కొనసాగుతున్నాయి. శుక్రవారం  బిఆర్ఎస్ నాయకులు మంత్రి తన్నీరు హరీష్ రావు సమక్షంలో పలువురు మహారాష్ట్రకు చెందిన ప్రముఖులు పార్టీలో చేరారు.  జనతాపార్టీ లాతూర్ జిల్లా అధ్యక్షుడు జయసింగ్ యాదవ్ బిఆర్ఎస్ లో చేరారు. వీరి చేరిక ప్రాధాన్యత సంతరించుకున్నది. వీరితో పాటు లాతూర్ జిల్లా సంఘటన కు చెందిన వోన్రాజ్ రాథోడ్, కాంగ్రేస్ పార్టీ నుంచి అర్జున్ రాథోడ్, భగవంత్ కులకర్ణి తదితరులు పార్టీలో చేరారు. వారికి గులాబీ కండువాకప్పి మంత్రి హరీశ్ రావు పార్టీలోకి ఆహ్వానించారు.

ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ…. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆధ్వర్యంలో బిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం తెలంగాణలో అమలు చేస్తున్న సాగునీరు, తాగునీరు, ఉచిత విద్యుత్ వంటి పథకాలు, రైతు వ్యవసాయం పేదల సంక్షేమం కోసం చేపట్టిన కార్యాచరణ నేడు తెలంగాణ రాష్ట్రాన్ని దేశానికి ఆదర్శంగా నిలిపిందని అన్నారు. మహారాష్ట్రలో బిఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుంటే తెలంగాణ మోడల్ పాలన మహారాష్ట్రలో కూడా అమలవుతుందని స్పష్టం చేశారు. దేశంలో కిసాన్ సర్కార్  స్థాపనకోసం బిఆర్ఎస్ జాతీయ అధ్యక్షులు సిఎం కేసీఆర్ నాయకత్వంలో అందరం కలిసికట్టుగా పనిచేద్దామని హరీష్ రావు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా బిఆర్ఎస్ నాయకులు  ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి,  ఎమ్మెల్యే బాల్క సుమన్, జయంత్ దేశ్ ముఖ్ తదితరులున్నారు.

కాగా….నిన్న జరిగిన దశాబ్ధి ఉత్సవాల ముగింపు వేడుకల్లో తామూ కూడా పాల్గొన్నామని, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం బిఆర్ఎస్ అధినేత సిఎం కేసీఆర్ నాడు చేసిన పోరాటం ఎంతో గొప్పగా వున్నదనే విషయాన్ని తాము అర్థం చేసుకున్నామని మహారాష్ట్ర నేతలు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయిన తర్వాత  స్వయం పాలనలో కూడా  అదే ఉద్యమ స్పూర్థిని కొనసాగిస్తూ పాలన చేయడం వలనే ఇంతటి అభివృద్ధి సాధ్యమైందని వారన్నారు. రైతులు పేదలు బడుగు బలహీన వర్గాలకోసం పోరాడేతత్వమున్న సిఎం కేసీఆర్ , మహారాష్ట్ర అభ్యున్నతి కోసం దేశ రైతాంగం కోసం కూడా పోరాడుతారనే విశ్వాసం తమకున్నదని వారు తమ మనసులో మాటను స్పష్టం చేశారు.

Latest News

More Articles