Friday, May 17, 2024

స్ట్రాంగ్ లీడర్ కావాలా.. రాంగ్ లీడర్ కావాలా.. ప్రజలు ఆలోచన చేయాలి

spot_img

హైదారాబాద్: కేసీఆర్ తన ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా రాష్ట్రం సాధించాడు. తెలంగాణ పట్ల తనకున్న ప్రేమ మరెవ్వరికి ఉండదు. స్ట్రాంగ్ లీడర్ కావాలా, రాంగ్ లీడర్ కావాలా అందరూ ఆలోచించాలని మంత్రి హరీశ్ రావు ప్రజలను కోరారు. ఐఎంఎ స్టేట్ ప్రెసిడెంట్ బిఎన్ రావు, వివిధ జిల్లాల అధ్యక్షులు, వైద్యులు తెలంగాణ భవన్ లో మంత్రులు హరీశ్ రావు, గంగుల కమలాకర్, ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మెన్ వినోద్ కుమార్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా గులాబీ కండువా కప్పి పార్టీలోకి వారిని ఆహ్వానించారు.

ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ.. వైద్యులు తెలంగాణ భవన్ లోకి వచ్చి పార్టీలో చేరడం గొప్ప విషయం అన్నారు. మిగతా రాజకీయ పార్టీలది పదవుల కోసం ప్రయత్నం. కానీ సీఎం కేసీఆర్  ఒక టాస్క్ లాగా భావించి అభివృద్ధి చేస్తున్నారు. తెలంగాణలో నేడు సుపరిపాలన అందుతున్నది. నాడు ఎంబీబీఎస్ చదవాలంటే పక్క దేశాలకు వెళ్లాల్సిన పరిస్థితి. నేడు తెలంగాణలో ఉంటూనే ఎంబీబీఎస్ చదివే అవకాశం ఉందన్నారు.

ప్రజలకు మంచి చేసే పనులు పత్రికల్లో ఎక్కువగా కనపడటం లేదు. కానీ ఎదుటి వారిని తిడితే వార్తల్లో ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. పేపర్ లీడర్ కావాలా, ప్రాపర్ లీడర్ కావాలా ప్రజలు ఆలోచించాలి. హైదరాబాద్ హెల్త్ హబ్ గా ఎదిగింది. ఫార్మా హబ్ గా ఎదిగింది. ఐటీ హబ్ గా ఎదిగింది. ధాన్యం ఉత్పత్తిలో నెంబర్ 1, వైద్యుల తయారీలో నెంబర్ 1గా నిలిచిందన్నారు.

నాడు బెంగాల్ ఆచరిస్తే, దేశం అనుసరిస్తది అనే వారు, దాన్ని తిరగరాసి తెలంగాణ. తెలంగాణ ఆచరిస్తే, దేశం అనుసరిస్తది అనేంతగా అభివృద్ధి చేశాం.  గ్రామీణ అవార్డుల్లో 38శాతం అవార్డులు తెలంగాణకే వచ్చాయి. మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటికి నీళ్లు అందించిన తెలంగాణ పథకాన్ని కేంద్రం హర్ ఘర్ కో జల్ అని కాపీ కొట్టింది. మేము మిషన్ కాకతీయ ద్వారా చెరువులు బాగు చేస్తే కేంద్రం అమృత్ సరోవర్ అని కాపీ కొట్టిందని వివరించారు.

దేశాన్ని రక్షించే సైనికులు, అన్నం పెట్టే రైతులకు, ప్రాణం కాపాడే వైద్యులకు ఎంతో విలువ ఉంది. అలాంటి రైతుల కోసం రైతు బంధు ఇచ్చిన ఘనత సీఎం కేసీఆర్ ది. రైతు బంధును పీఎం కిసాన్ సమ్మాన్ నిధి అని కేంద్రం అమలు చేస్తున్నది. అయితే మనం పది వేలు ఇస్తే, కేంద్రం మూడు వేలే ఇస్తున్నది. ప్రతి జిల్లాకు ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజీ అంటే దేశం మొత్తం అమలు చేస్తున్నారని తెలిపారు.

విశ్వకర్మలకు లక్ష ఆర్థిక సాయం అంటే, దాన్ని కేంద్రం కాపీ కొట్టి విశ్వ కర్మ యోజన అని ప్రారంభించింది. తెలంగాణ ప్రభుత్వం లక్ష ఆర్థిక సాయం ఇస్తే, కేంద్రం మాత్రం అప్పు రూపంలో ఇస్తున్నది. మక్కీకి మక్కీ తెలంగాణ పథకాలను కేంద్రం కాపి కొడుతున్నది. తెలంగాణ పథకాలు అనేక రాష్ట్రాల్లో అమలవుతున్నాయి. కల్యాణ లక్ష్మీ అంటే ఆర్థిక సాయం మాత్రమే కాదు, బాల్య వివాహాలను నివారించింది. పోలీసులు, చట్టం చేయలేని దాన్ని సీఎం కేసీఆర్ పెట్టిన ఒక పథకం సాధించిందని గుర్తుచేశారు.

కల్యాణ లక్ష్మీ గుణాత్మక మార్పుకు శ్రీకారం చుట్టింది. సామాజిక మార్పుకు నాంది పలికింది. మిషన్ భగీరథ ఉపరితల శుద్ధి చేసిన నీటి ద్వారా రోగాలు తగ్గాయి. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి, మిషన్ భగీరథ ద్వారా సీజనల్ డిసీజ్ తగ్గాయి. సమ్మర్ యాక్షన్ ప్లాన్ అని నాడు వెయ్యి కోట్లు ఖర్చు చేసేవారు.  బోరింగులు హైర్ చేసుడు, హ్యాండ్ పంప్ రిపేర్లు, మోటార్లు రిపేర్లు పేరిట ప్రతి ఏటా వృథా అవుతుండే. మిషన్ భగీరథ వచ్చాక, సమ్మర్ లేదు యాక్షన్ లేదు ప్లాన్ లేదు. డబ్బు ఆదా అయ్యింది. మిషన్ భగీరథ ద్వారా గొప్పమార్పు వచ్చిందన్నారు.

ప్రతి పథకం వెనుక సామాజిక కోణం దాగి ఉంది. కేసీఆర్ కిట్, న్యూట్రీషన్ కిట్ వల్ల ఇనిస్టిట్యూషనల్ డెలివరీలు 100 శాతం అవుతున్నాయి. దేశంలోనే వంద శాతం అవుతున్నది రాష్ట్రం తెలంగాణ. ప్రభుత్వ ఆసుపత్రుల్లో 2014లో 30శాతం డెలివరీలు జరిగితే, నేడు 72.8శాతం జరుగుతున్నాయి. వ్యవసాయ రంగం బలోపేతం ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అయ్యింది. కేసీఆర్ రైతును బలోపేతం చేశారు. తద్వారా వ్యవసాయం బలోపేతం అయ్యిందని పేర్కొన్నారు.

తెలంగాణలో ఎకరం అమ్మితే, ఆంధ్రలో వంద ఎకరాలు వస్తయని మొన్న చంద్రబాబు అన్నాడు. 9 ఏండ్ల తెలంగాణ అభివృద్ధి ప్రయాణంలో సీఎం కేసీఆర్ శ్రమ ఎంతో దాగి ఉంది. 24 గంటల ఉచిత కరెంట్ ఇచ్చే రాష్ట్రం తెలంగాణ తప్ప మరొక్కటి దేశంలో లేదు. తెలంగాణ ప్రభుత్వం ద్వారా లబ్ధి పొందని మనిషి ఉన్నారా? అందుకే స్ట్రాంగ్ లీడర్ చేతిలో రాష్ట్రం ఉండాలి, రాంగ్ లీడర్ చేతిలో పెట్టొద్దు. పొలిటికల్ స్టెబిలిటీ ఉంది కాబట్టి శాంతి భద్రతల సమస్య లేదు. అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించి, దేశానికి రోల్ మోడల్ అయ్యాము. మూడో సారి కేసీఆర్ ను సీఎం చేసేందుకు అందరం కలిసి కట్టుగా కృషి చేద్దాం.’’ అని మంత్రి హరీశ్ రావు పిలుపునిచ్చారు.

Latest News

More Articles