Friday, May 3, 2024

యావత్ భారతదేశం తెలంగాణను చూసి నేర్చుకోవచ్చు

spot_img

హైదరాబాద్: ఇది చాలా సంతోషకరమైన సమయం. తెలంగాణ రాష్ట్రంలో ఇలాగే సౌభ్రాతృత్వం వెల్లివిరియాలి. ఇందుకోసం ప్రభుత్వం తన కృషిని కొనసాగిస్తుందని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. శుక్రవారం సచివాలయంలోని నల్ల పోచమ్మ దేవాలయం, మసీద్, చర్చిలను గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడారు.

లౌకికత్వాన్ని చాటేలా ఆలయాలు, మసీదులు, చర్చిలు వెలయాలని ఆకాంక్షించారు. ఈ మూడు ఒక్కచోట ఉన్న ప్రదేశానికి ఉత్తమ నిదర్శనంగా మన తెలంగాణ రాష్ట్ర సెక్రటేరియట్ నిలుస్తుందన్నారు. హిందూ,ముస్లిం, క్రిస్టియన్ సోదరులు కలిసిమెలిసి ముందుకు సాగుతూ, ప్రార్థనలు చేసుకొంటూ ఐకమత్యాన్ని చాటుతున్నారు. యావత్ భారతదేశం తెలంగాణను చూసి నేర్చుకోవచ్చు. తెలంగాణ రాష్ట్రంలో ఇదే విధమైన సహృద్భావ పరిస్థితులు సదా కొనసాగాలని, ఎల్లవేళలా శాంతి నెలకొని ఉండాలని ముఖ్యంత్రి కేసీఆర్ ఆకాంక్షించారు.

అనంతరం సెక్రటేరియట్ సందర్శన కోసం గవర్నర్ ని తోడ్కొని డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయానికి సీఎం కేసీఆర్ చేరుకున్నారు. వారికి సచివాలయ ప్రాంగణాన్ని కలియదిరిగి చూయించారు. ఒక్కో ఫ్లోర్ గురించి వివరించారు. అనంతరం గవర్నర్ కు సాంప్రదాయ పద్ధతిలో ఆహ్వానం పలుకుతూ.. సీఎం కేసీఆర్ తన ఛాంబర్ కి తోడ్కొని వెళ్లి, శాలువాతో సత్కరించి పూల బోకెను అందించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి బొట్టు కుంకుమలతో గవర్నర్ గారిని సాంప్రదాయ పద్ధతిలో సన్మానించారు. అనంతరం హై‘టీ’ తో గవర్నర్ కు సిఎం కేసీఆర్ ఆతిథ్య మిచ్చారు.

ఈ సందర్భంగా…సచివాలయ నిర్మాణ కౌశలాన్ని, ఏర్పాటు చేసిన అధునాతన మౌలిక వసతుల వివరాలను గవర్నర్ సీఎం కేసీఆర్ ను అడిగి తెలుసుకున్నారు. డా.బి.ఆర్.అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయ నిర్మాణం చాలా గొప్పగా ఉందని గవర్నర్ తమిళి సై కొనియాడారు. సిఎం ఆతిథ్యం స్వీకరించి కాసేపు ఆహ్లాదకరమైన వాతావరణం లో ఇష్టా గోష్టి జరిపారు. అనంతరం  సచివాలయ సందర్శనను పూర్తిచేసుకుని తిరుగు ప్రయాణమైన గవర్నర్ గారికి ప్రధాన ద్వారం దాకా వెళ్ళి ముఖ్యమంత్రి వీడ్కోలు పలికారు.

ఈ కార్యక్రమంలో మంత్రులు హరీష్ రావు, ప్రశాంత్ రెడ్డి, మల్లారెడ్డి, మహమూద్ అలీ, పువ్వాడ అజయ్ కుమార్, ఎర్రబెల్లి దయాకర్ రావు, సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్ ఎమ్మెల్సీ పల్ల రాజేశ్వర్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే దానం నాగేందర్, ప్రభుత్వ విప్ బాల్క సుమన్, కోర్కంటి చందర్, ఎమ్మెల్సీ మధుసూదనా చారి,  ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ వినోద్ కుమార్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ, ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ పాల్గొన్నారు.

Latest News

More Articles