పదేళ్ల పాటు మంత్రి పదవులు అనుభవించి, ఇప్పుడు కష్టకాలంలో పార్టీ మారడం అంటే తల్లిపాలు తాగి రొమ్ము గుద్దినట్లుగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు బీఆర్ఎస్ నేత బాల్క సుమన్. ఇవాళ(గురువారం) మీడియాతో మాట్లాడిన ఆయన.. ఇంతకన్నా నీతిమాలిన, సిగ్గుమాలిన చర్య మరొకటి లేదంటూ కాంగ్రెస్ పార్టీలో చేరిన ఇంద్రకరణ్ రెడ్డిని ఉద్దేశిస్తూ మాట్లాడారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆయనకు రెండుసార్లు మంత్రిగా కేసీఆర్ అవకాశమిచ్చారన్నారు. ఓ పార్టీ అంతకంటే ఎక్కువ అవకాశం ఏమి ఇస్తుందని ప్రశ్నించారు.
సావుదలకు ముందు కాంగ్రెస్ లోకి వెళ్లి చేసేది ఏముంటుంది? అని నిలదీశారు బాల్కసుమన్. కేసీఆర్ రెండుసార్లు ఆయనకు అంతగా ప్రాధాన్యత ఇస్తే ఇలా చేశారని ఆరోపించారు. మొదటి నుంచి పార్టీలో ఉన్న తమలాంటి వారికి, సీనియర్లకు, కేసీఆర్ కుటుంబంతో సన్నిహితంగా ఉన్నవారికి కూడా మంత్రిగా అవకాశం రాలేదని, కానీ ఇంద్రకరణ్కు కేసీఆర్ ఆ అవకాశం ఇచ్చారన్నారు. ఇంద్రకరణ్ రెడ్డి తీసుకున్న నిర్ణయం సరైనది కాదన్నారు.
నాలుగు సీట్లలో కాంగ్రెస్ తమ పార్టీ నుంచి తీసుకున్న అభ్యర్థులనే నిలబెట్టిందని తెలిపారు బాల్క సుమన్. ఈ నాలుగు సీట్లలో కాంగ్రెస్ మూడోస్థానానికి పడిపోవడం ఖాయమన్నారు. మల్కాజ్గిరిలో సునీతా మహేందర రెడ్డి, సికింద్రాబాద్లో దానం నాగేందర్, చేవెళ్లలో రంజిత్ రెడ్డి, వరంగల్లో కడియం కావ్య.. ఈ నలుగురిని బీఆర్ఎస్ నుంచి తీసుకున్నారని అన్నారు. ఆ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ దారుణంగా ఓడిపోతుందని, ఈ ప్రభావం రాష్ట్రమంతా ఉంటుందని నాలుగు రోజుల క్రితం సునీల్ కనుగోలు రిపోర్టు ఇచ్చారన్నారు.
ఇది కూడా చదవండి: ఢిల్లీలో తెలంగాణ కోసం కొట్లాడేది బీఆర్ఎస్ పార్టీయే