తెలంగాణ పాలిటెక్నిక్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ పరీక్ష ఈ ఏడాది మే 17న పాలీసెట్ 2023 పరీక్ష నిర్వహించనున్నట్లు ఎస్బీటీఈటీ నిర్ణయించింది. పాలిటెక్నిక్ కోర్సుల్లో ప్రవేశాలకు ఎస్బీటీఈటీ జనవరి 3న సమావేశం నిర్వహించింది. దీనికి సంబంధించి ఆ శాఖ కమిషనర్ నవీన్ మిత్తల్ పరీక్ష తేదీని ఖరారు చేశారు. తెలంగాణ పాలీసెట్కు ఆన్లైన్ దరఖాస్తుల ప్రక్రియ జనవరి 16 నుంచి ప్రారంభమవుతుంది. ఈ సారి జరిగే పాలీసెట్లో బాసర ఆర్జీయూకేటీ చేరడం లేదని ప్రకటించింది. త్వరలోనే ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదలకానుంది.
పాలీసెట్ పరీక్షకు దరఖాస్తు చేసుకునే విద్యార్థులు 10వ తరగతిలో తప్పనిసరిగా ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఈ ప్రవేశ పరీక్షలో సాధించిన ర్యాంకు ద్వారా రాష్ట్రంలోని పాలిటెక్నీక్ కాలేజీలు, ప్రైవేటు ఇంజినీరింగ్ కాలేజీల్లో నడుస్తోన్న పాలిటెక్నిక్ కాలేజీలు, ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ, పీవీ నర్సింహారావు తెలంగాణ యూనివర్సిటీతో పాటు వీటికి అనుబంధంగా ఉన్న పాలిటెక్నీక్ కోర్సులు అందించే సంస్థల్లో సీట్లను భర్తీ చేయనున్నారు.