విధినిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనపరిచే పోలీసు అధికారులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించిన పలు అవార్డులు, ప్రత్యేక సేవా పతకాలను రేపు (బుధవారం) ప్రదానం చేయనున్నారు. హైదరాబాద్ రవీంద్ర భారతిలో నిర్వహించే కార్యక్రమంలో రాష్ట్ర హోం శాఖ మంత్రి మహమూద్ అలీ, డీజీపీ అంజనీ కుమార్ లు ఈ పతకాలను అందచేయనున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించే గ్యాలంటరీ అవార్డుల మాదిరిగానే… అత్యుత్తమ సర్వీసులు అందించే పోలీసు అధికారులకు కూడా తెలంగాణ ప్రభుత్వం గత కొన్నేళ్లుగా ఈ అవార్డులను అందచేస్తోంది.
ఈ అవార్డులలో అతి ఉత్ర్కిష్ట్ సేవ పతకాలు-2022 లను 30 మంది పోలీస్ అధికారులకు, ఉత్ర్కిష్ట్ సేవ పతకాలు-2022 కు గాను 28 మందికి, అసాధారణ ఆసూచన కుశలత పతకాలను ఏడుగురికి, ఇన్వెస్టిగేషన్ లో ఉత్తమ ప్రతిభ చూపిన వారికి కేంద్ర హోం మంత్రి మెడల్స్ 8మందికి, ట్రైనింగ్ లో ఉత్తమ ప్రతిభ చూపిన వారికి కేంద్ర హోమ్ మంత్రి మెడల్స్ 11 మందికి, శౌర్య పతకం- 2022 లు 11 మందికి, మహోన్నత సేవ పతకం -2022 లు ఏడుగురు పోలీస్ అధికారులకు అందచేయనున్నారు.
తెలంగాణ రాష్ట్ర ఉత్తమ సేవ పతకం-2019 లను 84 మంది పోలీస్ అధికారులకు, ఆంత్రిక్ సురక్ష సేవ పథకం-2019 లను 67 మంది పోలీస్ అధికారులకు, ఆంత్రిక్ సురక్ష సేవ పతకం-2021 లను 28 మంది పోలీస్ అధికారులకు అందచేయనున్నారు.
ఈ పతకాలను అందుకోనున్న వారిలో డీజీపీ ఒకరు, అడిషనల్ డీజీ లు ఇద్దరు, ఐజీలు ఇద్దరు, డీఐజీ ఒకరు, ఎస్పీ లు ఇద్దరు, అడిషనల్ ఎస్పీలు ఐదుగురు, డీఎస్పీలు 22 మంది ఉన్నారు. వీరితో పాటు.. 39 మంది ఇన్స్పెక్టర్లు, 57 మంది ఎస్.ఐలు, 31 మంది ఏఎస్ఐలు, 22 మంది హెడ్ కానిస్టేబుళ్లు, 96 మంది కానిస్టేబుళ్లు ఉన్నారు.