Sunday, May 19, 2024

తెలంగాణ రాష్ట్రంలో జరిగే కురుక్షేత్రంలో గెలిచేది ధర్మమే

spot_img

‘రేపు తెలంగాణ రాష్ట్రంలో జరిగే కురుక్షేత్రంలో గెలిచేది ధర్మమే. కాంగ్రెస్ కౌరవుల పార్టీ.. అభివృద్ధి గెలవాలా? అబద్ధం గెలవాలా? అనే దానిపైనే పోటీ ఉంది’ అని వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. ఆదివారం సిద్దిపేట వ్యవసాయ మార్కెట్ యార్డులో సిద్దిపేట, దుబ్బాక నియోజకవర్గ పరిధిలోని 7,200 మంది మత్స్యకారులకు సహచర మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌తో కలిసి గుర్తింపు కార్డులను పంపిణీ చేసి మాట్లాడారు. గతంలో మత్స్యకారులకు సభ్యత్వం దొరకడం కష్టంగా ఉండేదని, కానీ ఇప్పుడు అందరూ సంతోషంగా ఉన్నారని మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు. దుబ్బాక, సిద్దిపేట నియోజకవర్గ గంగపుత్రులకు రాష్ట్రంలోనే మొదటిసారి గుర్తింపు కార్డులు ఇవ్వడం సంతోషంగా ఉందన్నారు. దేశంలోనే ఎక్కడా లేని విధంగా 2 వేల కోట్ల రూపాయలతో మత్స్యకారుల సంక్షేమానికి ఖర్చు చేసిన ఏకైక నాయకుడు కేసీఆర్, బీఆర్ఎస్ ప్రభుత్వం అని చెప్పారు. కాంగ్రెస్ హయాంలో కొన్ని చెరువులలో సబ్సిడీపై చేప పిల్లలు వేసేవారని, నేడు రాష్ట్రంలోని అన్ని చెరువులలో ఉచితంగా వంద శాతం సబ్సిడీతో చేప పిల్లలను ఇస్తున్నట్లు మంత్రి వెల్లడించారు.

సిద్దిపేట నుంచి విజయవాడ, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్‌కు చేపలు ఎగుమతి అవడం గర్వ కారణమని పేర్కొన్నారు. పూటకొక దొంగ డిక్లరేషన్ చేసే కాంగ్రెస్ పార్టీని ఎవ్వరూ నమ్మరన్నారు. మూడోసారి కూడా సీఎం కేసీఆర్ అని తెలంగాణ ప్రజలు సెల్ఫ్ డిక్లరేషన్ చేశారని మంత్రి హరీశ్ రావు స్పష్టం చేశారు. హైదరాబాద్‌లో కాంగ్రెస్ ఏఐసీసీ మీటింగ్ పెడ్తదట. ఇక అన్నీ అబద్ధాలు చెప్పడం మొదలు పెడతారని, 60 ఏళ్లు పాలించి అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు చేయలేదో ముందు సమాధానం చెప్పాలని కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రజలు అమాయకులు కాదని.. వచ్చే ఎన్నికల్లో విజయాలకు, అబద్ధాలకు మధ్య పోటీ ఉంటుందని హరీశ్ రావు ఘాటుగా విమర్శించారు.

కౌరవులు ఎక్కడా గెలువరని, ధర్మం పాటించిన పాండవులే గెలుస్తారని మంత్రి హరీశ్ రావు అన్నారు. రేపు తెలంగాణలో జరిగే కురుక్షేత్రంలో గెలిచేది ధర్మమేనని, కాంగ్రెస్ కౌరవుల పార్టీ అని ఆయన అన్నారు. అభివృద్ధి గెలవాలా.? అబద్ధం గెలవాలా? అనే దానిపైనే పోటీ ఉంటుందని మంత్రి అన్నారు. అభివృద్ధి చేసిన పార్టీని మరోసారి ఆశీర్వదించాలని హరీశ్ రావు విజ్ఞప్తి చేశారు.

Latest News

More Articles