Sunday, May 19, 2024

అప్లికేషన్లకు డబ్బులు, టికెట్‎కు డబ్బులు, కర్నాటక నుంచి డబ్బులు.. ఇదీ కాంగ్రెస్

spot_img

తెలంగాణలో డబ్బులు పంచి కాంగ్రెస్ గెలవాలని చూస్తుందని మంత్రి హరీశ్ రావు అన్నారు. మెదక్‎లో స్థానిక ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి, సీనియర్ లీడర్ పట్లోళ్ల శశిధర్ రెడ్డితో కలిసి మంత్రి హరీష్ రావు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘బెంగళూరులో జరిగిన ఐటీ దాడుల్లో కాంగ్రెస్ పార్టీ నోట్ల కట్టలు బయటపడ్డాయి. అక్రమంగా సంపాదించిన డబ్బుతో తెలంగాణలో గెలవాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. ఐటీ దాడుల్లో దొరికిన 40 కోట్లు కాంగ్రెస్ నేత అంబికాపతి ఇంట్లోనివే. గతంలో కర్నాటకలో 40 శాతం కమీషన్ గవర్నమెంట్ ఉంటే.. ఇప్పుడు 50 శాతం కమీషన్ ప్రభుత్వం నడుస్తుంది. అక్కడ కాంట్రాక్టర్ల నుంచి డబ్బులు వసూలు చేసి తెలంగాణకి తరలిస్తున్నారు. ఈ రోజు అంబికాపతి ఇంట్లో రూ. 42 కోట్లు దొరికాయి. వీటిని తెలంగాణకు తరలించడానికి సిద్ధం చేశారు. కర్నాటకలో దాదాపు రూ. 1500 కోట్లు వసూల్ చేసి తెలంగాణలో ఖర్చుపెట్టి గెలవాలని కాంగ్రెస్ ప్లాన్ చేస్తుంది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి సగం సీట్లలో అభ్యర్థులు కరువు. పక్క పార్టీల నుంచి వచ్చేవాళ్ళ కోసం కాంగ్రెస్ దిక్కులు చూస్తుంది. కాంగ్రెస్ పార్టీకి సోషల్ మీడియాలో హంగామా తప్ప గ్రౌండ్ లెవెల్‎లో బలం లేదు. కర్నాటకలో కొత్తగా ఎవరైనా ఇల్లు కడితే ఎస్ఎఫ్టీకి 75 రూపాయల డబ్బులు కట్టాలి. కాంగ్రెస్ పార్టీ కాదు అది స్కాంగ్రెస్ పార్టీ. బెంగళూరు వయా చెన్నై నుంచి కొంత డబ్బులు హైదరాబాద్‎కి చేరాయి. కొంత మంది బిల్డర్లకు డబ్బులు వచ్చాయని తెలిసింది, వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. తెలంగాణలో కాంగ్రెస్ గెలుస్తుంది అనుకోవడం ఓ పగటి కల. కాంగ్రెస్‎లో డబ్బుల్లోనోళ్ళకే టికెట్ దొరుకుతుంది. నమ్ముకున్న కార్యకర్తలకు ద్రోహం చేస్తుంది. ఆ పార్టీలో ప్రజాస్వామ్యానికి, ప్రజలకు విలువలేదు. అప్లికేషన్లకు డబ్బులు, టికెట్ ఇవ్వడానికి డబ్బులు, కర్నాటక నుంచి డబ్బులు.. వీటిని గెలవాలని కాంగ్రెస్ చూస్తోంది’ అని ఆయన అన్నారు.

Read Also: చంద్రబాబుకు ముందస్తు బెయిల్‌ మంజూరు

Latest News

More Articles