తెలంగాణ రాష్ట్రావతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా పల్లె ప్రగతి దినోత్సవం నిర్వహించారు. పల్లె ప్రగతి దినోత్సవం నేపథ్యంలో తెలంగాణ గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం తీసుకున్న చర్యలు, అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తూ రాష్ట్ర మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. ఉద్యమ నినాదాలను నిజం చేయడమే కాదు.. జాతిపిత మహాత్ముడు కన్నకలల్ని సీఎం కేసీఆర్ సాకారం చేశారని తెలిపారు.
ఇక పల్లెసీమలే దేశానికి పట్టుగొమ్మలన్న.. మహాత్మా గాంధీ ఆశయమే స్ఫూర్తిగా.. సీఎం గ్రామ స్వరాజ్యానికి బాటలు వేశారు. పల్లె ప్రగతికి ప్రాణం పోశారని కేటీఆర్ కొనియాడారు. నాడు.. దశాబ్దాలపాటు దగాపడ్డ పల్లె.. నేడు.. దర్జాగా కాలర్ ఎగరేస్తోంది అని అభిప్రాయపడ్డారు. సమస్యల సుడిగుండంలో విలవిలలాడిన ఊరు.. ఇవాళ సకల సౌకర్యాలతో వెలిగిపోతోందని ప్రశంసించారు. సీఎం కేసీఆర్ సంకల్పంతో ప్రతి పల్లె సీమ.. ప్రగతిసీమగా మారిందని కేటీఆర్ తన ట్వీట్లో పేర్కొన్నారు.