Friday, May 17, 2024

రాజకీయ నిరుద్యోగులు రాష్ట్ర యువతను రెచ్చగొడుతున్నరు

spot_img

హైదరాబాద్: జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలు ఎంప్లాయిమెంట్ పాలసీని ప్రకటించి, దేశంలో నెలకొన్న నిరుద్యోగ సమస్య పైన అధికారంలో ఉన్నప్పుడు స్పందిస్తే దేశంలో ఇవాళ నిరుద్యోగ సమస్య ఉండేదే కాదన్నారు బీఆర్ఎస్ ప్రెసిడెంట్, పురపాలక శాఖ మంత్రి కే.తారకరామారావు. తాము అధికారంలో ఉన్నప్పుడు నిరుద్యోగ సమస్య పట్టించుకోకుండా యువతను కేవలం రాజకీయాలకు మాత్రమే వాడుకోవడం కాంగ్రెస్ పార్టీకి అలవాటైందన్నారు. ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర రావు నాయకత్వంలో 2.2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తున్నామన్న కేటీఆర్, ప్రైవేటు రంగంలో 22 లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామన్నారు. బీఆర్ఎస్ లెక్కనే జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలు పనిచేస్తే ఏ ఒక్కరూ నిరుద్యోగిలా మిగిలేవారు కాదన్నారు. యువ సంఘర్షణ సభ పేరుతో తెలంగాణకు వస్తున్న కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకగాంధీ తాము అధికారంలో ఉన్నప్పుడు ఇక్కడ చేసిన నియామకాలు, కల్పించిన ఉద్యోగ ఉపాధి అవకాశాలు, యువతకు చేసిన మంచిని చెబితే బాగుంటుందని అన్నారు.

రెచ్చగొట్టాలని చూస్తే.. తెలంగాణ సమాజం సహించదు

కాంగ్రెస్ నేతలు పదేళ్లుగా అధికారానికి దూరమైన ప్రస్టేషన్ లో ఉన్నారన్న సంగతిని తాము అర్థం చేసుకోగలమన్నారు. రాజకీయ నిరుద్యోగులుగా మారిన కాంగ్రెస్ పార్టీ నాయకులు అధికారం కోసం ఉద్యోగాలకు సిద్ధమవుతున్న యువతను రెచ్చగొట్టాలని చూస్తే తెలంగాణ సమాజం సహించదని హెచ్చరించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎపీపీఎస్సీ ద్వారా కాంగ్రెస్ భర్తీ చేసిన నియామకాలెన్ని ? కేవలం తొమ్మిదేళ్లలో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన నియామకాలెన్నో తెలుసుకోవాలన్నారు. రాత పరీక్షల్లో మెరుగైన ఫలితాలు సాధించిన తెలంగాణ బిడ్డలకు ఇంటర్వ్యూల్లో అన్యాయం చేసిన నాటి చేదు జ్ఞాపకాలు ఇంకా తమ కళ్ల ముందే కదలాడుతున్నాయన్నారు. నాటి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీసు కమిషన్ ను కాసుల కమిషన్ గా మార్చిన కాంగ్రెస్ పార్టీ నేతలు  ఇప్పుడొచ్చి నీతులు చెబితే ఎవరూ నమ్మరన్నారు కేటీఆర్.

ముందుగాల ముక్కనేలకు రాసి క్షమాపణ చెప్పాలి

నీళ్లు, నిధులు, నియామకాల కోసం సాగిన మహోన్నత తెలంగాణ ఉద్యమంలో జరిగిన వందలాది యువత ప్రాణ త్యాగాలకు కాంగ్రెస్ పార్టీ ముందుగాల ముక్కనేలకు రాసి క్షమాపణ చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ఈ మాట నేను మాత్రమే అనడం లేదన్న కేటీఆర్… తెలంగాణ ఉద్యమంలో యువకుల బలిదానాలకు కారణం అప్పటి కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వమే అని… సోనియా గాంధీని బలిదేవత అన్న  తమ పార్టీ పిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి మాటల మేరకైయినా తెలంగాణ యువతకు అధికారంలో ఉన్నప్పుడు… ఉద్యమ కాలంలో చేసిన ద్రోహాలకు క్షమాపణ చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.

పొలిటికల్ టూరిస్టులకు స్వాగతం.. “ఆవో, దేఖో, సీఖో”

హైదరాబాద్ నగరం విశ్వ నగరంగా రూపుదిద్దుకుంటుందని లక్షలాది మంది టూరిస్టులకు స్వాగతం పలుకుతున్నదన్న కేటీఆర్… ఢిల్లీ నుంచి వచ్చే ప్రియాంక గాంధీ లాంటి పొలిటికల్ టూరిస్టులకు కూడా స్వాగతం పలుకుతుందన్నారు. అంతరించే జాబితాలో అగ్రస్థానంలో ఉన్న కాంగ్రెస్ పై దింపుడు కళ్లెం ఆశతో ఉన్న ప్రియాంకా గాంధీ తన ఈ పొలిటికల్ టూర్ ను ఎడ్యుకేషన్ టూర్ గా మార్చుకోవాలని కేటీఆర్ హితవు పలికారు. కాంగ్రెస్ పార్టీ మెడలు వంచి తాము సాధించుకున్న తెలంగాణ రాష్ట్ర వెలుగుల ప్రస్థానాన్ని ప్రియాంకగాంధీ స్వయంగా తెలుసుకోవాలన్నారు. శంషాబాద్ విమానాశ్రయంలో దిగి నగరంలోకి వచ్చే సమయంలో కనిపించే అందమైన రోడ్లు, అద్భుతమైన ఫ్లే ఓవర్లు, కేబుల్ బ్రిడ్జి లాంటి అధునాతన నిర్మాణాలు, ప్రపంచ దిగ్గజ ఐటీ కంపెనీల కార్యాలయాలు చూసైనా పరిపాలన పాఠాలు నేర్చుకోవాలని సూచించారు. ఊహించనంత వేగంగా డెవలప్ అయిన హైదరాబాద్ నగరం న్యూయార్క్ ను తలపిస్తోందని సూపర్ స్టార్ రజనీకాంత్ లాంటి ప్రముఖులు ఇటీవల చేసిన ప్రశంసల గురించి కాంగ్రెస్ లీడర్లను అడగాలన్న కేటీఆర్, నిజాలు చెప్పడానికి వాళ్లు కాస్త మొహమాటపడొచ్చని, అయితే ఒకటికి రెండు సార్లు అడిగితే బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్దిని వాళ్లే గుక్కతిప్పుకోకుండా చెపుతారన్నారన్న నమ్మకం తనకు ఉందన్నారు. ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ ను చదివే కాంగ్రెస్ మార్క్ సంస్కృతిని పక్కనెట్టి ఇక్కడి పరిస్ధితులను అద్యయనం చేస్తూ “ఆవో, దేఖో, సీఖో” అని ప్రియాంకగాంధీకి కేటీఆర్ స్వాగతం పలికారు.

సొంత పార్టీ నేతలకు ప్రియాంకగాంధీ బుద్ధిచెప్పాలి

దశాబ్దాల కాంగ్రెస్ పాలనలో సంక్షోభానికి సెంటర్ గా ఉన్న తెలంగాణ, తొమ్మిదేళ్ల కేసిఆర్ పాలనలో దేశంలోనే నంబర్ వన్ రాష్ట్రం గా ఎదిగిందన్నారు కేటీఆర్. కాంగ్రెస్ హయాంలో తాగునీటి కోసం కిలోమీటర్లకు కిలోమీటర్లు నడిచిన తండ్లాటను తెలంగాణ ఆడబిడ్డలు ఇంకా మరిచిపోలేదన్న సంగతిని ప్రియాంకగాంధీ గుర్తుంచుకోవాలన్నారు. తడారిన గొంతులకు మిషన్ భగీరథ తో జలాభిషేకం చేసిన ముఖ్యమంత్రి కేసిఆర్ కు ఎప్పటికీ అండగా ఉంటామని.. ప్రతీ తండా చేస్తున్న ప్రతిజ్ఞ ఎక్కడికెళ్లినా ప్రియాంకగాంధీకి వినిపిస్తుందన్నారు. ఒక్క పంటకు కూడా సాగునీరు ఇవ్వలేని కాంగ్రెస్ చేతకానితనంతో ఒకప్పడు కమ్ముకున్న దుర్భిక్ష ఛాయలు ఇప్పుడు భూతద్దం పెట్టి వెతికినా కనిపించవనడానికి కోటి ఎకరాల సిరుల మాగాణమే సాక్ష్యమన్నారు. ప్రాజెక్టు కట్టకముందే కాలువలు తవ్వి కమిషన్లు జేబులో వేసుకున్న కాంగ్రెస్ పాలన లెక్క కాకుండ ప్రపంచంలోనే అతి పెద్ద లిప్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కాళేశ్వరంను మెరుపు వేగంతో పూర్తిచేసిన ఘనత బీఆర్ఎస్ సొంతమన్నారు. నాలుగేళ్లలోనే ఇంత భారీ ప్రాజెక్టును పూర్తిచేసిన కేసీఆర్ పట్టుదల గురించి ఇతర రాష్ట్రాల్లోని కాంగ్రెస్ ప్రభుత్వాధినేతలకు చెప్పి అక్కడి ప్రజలకు మేలుచేయాలని చెప్పారు.

పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును కూడా శరవేగంగా పూర్తిచేసేందుకు ప్రయత్నిస్తుంటే.. తప్పుడు కేసులు వేసి అభివృద్ధి నిరోధకులుగా వ్యవహరిస్తున్న సొంత పార్టీ నేతలకు ప్రియాంకగాంధీ బుద్ధిచెప్పాలన్నారు. కరెంట్ తీగలపై బట్టలు ఆరేసుకునే దుస్థితి కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఉందేమోకానీ తెలంగాణలో మాత్రం ఎక్కడా లేదన్న కేటీఆర్, కాంగ్రెస్ పాలన అంటేనే గుర్తొచ్చే కాలిపోయే మోటర్లు, పేలిపోయే ట్రాన్స్ ఫార్మర్ల దుస్థితిని రూపుమాపి రైతులకు 24 గంటలు ఉచితంగా నాణ్యమైన విద్యుత్ ఇస్తున్న ఏకైక పాలకుడు కేసిఆర్ అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలన్నారు. పెట్టుబడికే కాదు పంట నష్టపోయినా అన్నదాతకు పదివేల సాయం చేస్తున్న ఏకైక ప్రభుత్వం తమదే అన్నారు కేటీఆర్. కాంగ్రెస్ రాబందు పాలనకు కేసీఆర్ రైతుబంధు పాలనకు మధ్య ఉన్న స్పష్టమైన తేడాను తెలంగాణ సమాజం ఎప్పుడో గుర్తించిందన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన 200 రూపాయల చాలీచాలని పెన్షన్ తో ఇబ్బందులు పడ్డ బతుకులు కేసీఆర్ ఇస్తున్న రెండువేల రూపాయల పెన్షన్ తో ఆత్మాభిమానాన్ని నింపుకున్నాయన్నారు.

అప్పుడే తెలంగాణ ఇచ్చి ఉంటే.. వందల బలిదానాలు జరిగేవి కావు

2004  కామన్ మినిమమ్ ప్రోగ్రామ్ లో పెట్టినప్పుడే తెలంగాణ ఇచ్చి ఉంటే  వందల మంది తెలంగాణ బిడ్డల బలిదానాలు జరిగి ఉండేవి కాదన్న సత్యాన్ని ప్రియాంకగాంధీ తెలుసుకోవాలన్నారు కేటీఆర్. సుదీర్ఘ ఉద్యమంలో ఏనాడు ప్రజల పక్షాన నిలబడకుండ ఇప్పుడొచ్చి మాట్లాడితే చైతన్యవంతమైన తెలంగాణ సమాజం నమ్ముతుందన్న భ్రమలో ఉండొద్దని హితవు పలికారు. కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణలో సాగుతున్న మానవీయ పాలన గురించి అధికారంలో ఉన్న ఒకటి అరా కాంగ్రెస్ ప్రభుత్వాలకు సోదాహరణంగా వివరించి ప్రజల మెప్పు పొందాలని ప్రియాంకగాంధీకి సూచించారు.

కేసీఆర్ చేతిలోనే  భవిష్యత్తును పదిలం

సోనియాగాంధీని బలిదేవత అన్న వ్యక్తికే పీసీసీ చీఫ్ పదవి ఇచ్చిన కాంగ్రెస్ నాయకత్వానిది అమాయకత్వమో, ఆత్మహత్యా సదృశ్యమో తేల్చుకోవాలన్నారు కేటీఆర్. గాంధీభవన్ ను గాడ్సేకు అప్పగించి తన అంతానికి కాంగ్రెస్ పార్టీనే స్వయంగా వీలునామా రాసుకుందన్నారు. కాని తెలివిగల్ల తెలంగాణ ప్రజలు తమ చిరకాల స్వప్నమైన రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్ చేతిలోనే  భవిష్యత్తును పదిలంగా భద్రపరుచుకున్న సంగతిని పొలిటికల్ టూరిస్ట్ ప్రియాంకగాంధీ ఈ పర్యటనలో తెలుసుకుంటారని కేటీఆర్ ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.

Latest News

More Articles