Friday, May 3, 2024

లక్షన్నర మంది రైతులతో ‘పాలమూరు’ ప్రారంభోత్సవం

spot_img

హైదరాబాద్: ఈనెల 16వ తారీఖున జరిగే పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టు ప్రారంభోత్సవ కార్యక్రమ ఏర్పాట్లను రాష్ట్ర సచివాలయంలో మంత్రి కేటీఅర్ సమీక్షించారు.  మహబూబ్నగర్, రంగారెడ్డి జిల్లా మంత్రులు నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్, వివిధ శాఖల అధిపతులు, పూర్వ జిల్లా కలెక్టర్లు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

Also Read.. నల్లగొండలో కాంగ్రెస్‌ పార్టీకి షాక్‌..!

ఈ సమావేశంలో మంత్రి కేటీఆర్ మాట్లాడారు. వలసల జిల్లాలో ఒకనాడు పడావుపడ్డ పాలమూరు జిల్లాను ఈ పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పచ్చగా చేస్తుందని అని అన్నారు. ప్రతి ఏటా లక్షలమంది పాలమూరు ప్రజలు వలస పోయే పరిస్థితి ఉండేది. కానీ నేడు లక్షల ఎకరాలకు సాగునీరు అందించే స్థాయి ప్రాజెక్టు ప్రారంభోత్సవం చేసుకుంటున్నామని హర్షం వ్యక్తం చేశారు.

ఈ ప్రాజెక్టు పాలమూరుతో పాటు రంగారెడ్డి జిల్లా భూములకు సైతం నీళ్లు అందిస్తుంది. గోదావరిలో కాళేశ్వరం, కృష్ణాలో పాలమూరు-రంగారెడ్డి లాంటి గొప్ప ప్రాజెక్టును తెలంగాణ ప్రభుత్వం కట్టింది. సీతారామ ప్రాజెక్టు కూడా పూర్తి అయితే తెలంగాణ సాగునీటి రంగంలో ప్రాజెక్టులు సంతృప్త స్థాయిలో పూర్తి అవుతాయి. తెలంగాణ రాష్ట్రం కెసిఆర్ నాయకత్వంలో కట్టిన ప్రాజెక్టులను చూసి కేవలం తెలంగాణ బిడ్డగానే కాకుండా భారత దేశ పౌరుడిగా కూడా గర్వంగా ఉంటుందన్నారు.

Also Read.. హైదరాబాద్ అభివృద్ధి ట్రైలర్ మాత్రమే.. సినిమా ముందుంది.. కేటీఆర్ వ్యాఖ్యలు వైరల్…!!

ఈ ప్రాజెక్టుల నిర్మాణం వెనక 2001 నుంచి కన్న తెలంగాణ ప్రజల కల ఇది. ఉద్యమ కాలం నుంచి కెసిఆర్ గారి ఆలోచనల మేరకు రూపుదిద్దుకున్న గొప్ప ప్రాజెక్టు ఇది. పాలమూరు రంగారెడ్డి ప్రజలు పడిన కష్టాలను తీర్చే గొప్ప ప్రాజెక్టు ఇది. అనేక అడ్డంకులను దాటుకుని గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పట్టుదలతో పూర్తయిన ప్రాజెక్టు ఇది. రైతుల పొలాలకు సాగునీటితో పాటు, రాజధాని ప్రజల తాగునీటి అవసరాలు, పరిశ్రమలకు అవసరమైన నీటి సరఫరాను కూడా ఈ ప్రాజెక్టు అందిస్తుందని తెలిపారు.

16వ తేదీన జరిగే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ప్రారంభోత్సవం తెలంగాణ చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిపోతుంది. ఇంత గొప్ప సందర్భాన్ని గొప్పగా నిర్వహించాల్సిన అవసరం ఉన్నది. ఈ ప్రాజెక్టు యొక్క విశిష్టతను ప్రజలకు తెలియజేసేలా గొప్పగా సంబరాలు చేసుకోవాలి. కనీసం లక్షన్నర మంది రైతులతో ప్రారంభోత్సవం సభ ఉంటుందని కేటీఆర్ స్పష్టం చేశారు.

ప్రారంభోత్సవ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లపైన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఇతర విభాగాల అధిపతులతో కూలంకషంగా చర్చించారు మంత్రులు. మంత్రులు సంబంధిత ఎమ్మెల్యేలతో సభకు అవసరమైన ఏర్పాట్లను స్థానికంగా సమన్వయం చేసుకోవాలని మంత్రి కేటీఆర్ సూచించారు.

Latest News

More Articles