పౌరసేవలను ప్రజలకు మరింత చేరువ చేసేందుకే వార్డు కార్యాలయాలను ప్రారంభిస్తున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. పురపాలనలో మరో సంస్కరణకు శ్రీకారం చుట్టడం సంతోషంగా ఉందన్నారు. ఇవాళ(శుక్రవారం) కాచిగూడలో వార్డు కార్యాలయాన్ని ప్రారంభించిన తర్వాత ఆయన మాట్లాడారు. ఒక్కో వార్డులో 10 మంది అధికారులు అందుబాటులో ఉంటూ ప్రజలుకు మెరుగైన, సులభమైన సేవలు అందిస్తారని తెలిపారు. ప్రజలు కేంద్రంగా పాలనే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు మంత్రి కేటీఆర్. ఇకపై వార్డు కార్యాలయాల్లో కనీస పౌరసేవలు, ఫిర్యాదులు పరిష్కారమవుతాయన్నారు. సిటిజన్ ఛార్టర్కు అనుగుణంగా ప్రజలకు సేవలు అందుతాయన్నారు.
దేశం మొత్తం మన వైపు చూస్తోందని.. ఈ కార్యక్రమం విజయవంతమైతే దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి హైదరాబాద్కు వచ్చి నేర్చుకుని వెళ్లే పరిస్థితి ఉంటుందని చెప్పారు మంత్రి కేటీఆర్. ఇప్పటికే తెలంగాణ ఎన్నో రంగాల్లో దేశానికి ఆదర్శంగా ఉందన్నారు. పార్టీలకు అతీతంగా ఫిర్యాదులను స్వీకరించాలని.. తరతమ భేదాలు చూపొద్దని జీహెచ్ఎంసీ అధికారులు, సిబ్బందిని ఆదేశించారు మంత్రి కేటీఆర్.