ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ నేడు నాలుగు జిల్లాల్లో పర్యటించనున్నారు. హనుమకొండ, జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్, జనగామ జిల్లాల పరిధిలో మంత్రి కేటీఆర్ పర్యటించి, పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. మొదట భూపాలపల్లిలో సమీకృత కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయాలను, సర్వాయి పాపన్న విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. డబుల్ బెడ్రూం ఇండ్లతోపాటు గృహలక్ష్మి, దళితబంధు లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందజేస్తారు. పరకాల, భూపాలపల్లి, పాలకుర్తి నియోజకవర్గాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. అనంతరం మినీ స్టేడియంలో ఏర్పాటుచేసిన భారీ బహిరంగసభలో పాల్గొంటారు.
Read Also: సీఎం కేసీఆర్ గుడ్న్యూస్.. నగదు రహిత చికిత్స కోసం ట్రస్ట్
ఆ తర్వాత హనుమకొండ జిల్లాలోని పరకాలలో మున్సిపాలిటీ, తహసీల్, ఆర్డీవో కార్యాలయ భవనాలను ప్రారంభిస్తారు. చలివాగుపై చెక్డ్యాం, ధోబీఘాట్, డిగ్రీ కళాశాల నూతన భవనం పనులకు శంకుస్థాపన చేస్తారు. సంక్షేమ పథకాల లబ్ధిదారులకు ప్రొసీడింగ్ పత్రాలను అందించనున్నారు. పట్టణంలోని పశువుల అంగడి ఆవరణలో బహిరంగ సభలో పాల్గొంటారు.
అదేవిధంగా మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణం, నూతన మున్సిపల్ కార్యాలయ భవనం పనులకు శంకుస్థాపన చేయనున్నారు. తొర్రూరు పెద్ద చెరువు వద్ద మినీ ట్యాంక్బండ్, శుద్ధి చేసిన మంచినీటి సరఫరా పనులకు కేటీఆర్ శంకుస్థాపన చేయనున్నారు. పాలకేంద్రం సమీపంలో బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు.
అనంతరం జనగామ జిల్లా కొడకండ్లకు చేరుకొని మినీ టెక్స్టైల్ పార్క్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయనున్నారు.