Sunday, May 19, 2024

సీఎం కేసీఆర్ గుడ్‎న్యూస్.. నగదు రహిత చికిత్స కోసం ట్రస్ట్‌

spot_img

సీఎం కేసీఆర్‌ది ఎంప్లాయ్‌ ఫ్రెండ్లీ ప్రభుత్వమని మరోమారు రుజువైంది. రాష్ట్రంలోని ఉద్యోగులు, పెన్షనర్లకు ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు తీపికబురు చెప్పారు. దసరాకు ముందే లక్షల కుటుంబాల్లో పండుగ వాతావరణం తీసుకొచ్చారు. ఉద్యోగులు, పెన్షనర్లకు నగదు రహిత చికిత్స అందించేందుకు ప్రత్యేకంగా ‘ఎంప్లాయ్‌ హెల్త్‌ కేర్‌ ట్రస్ట్‌’ (ఈహెచ్‌టీసీ) ఏర్పాటు చేసి నూతన ‘ఎంప్లాయిస్‌ హెల్త్‌ సీమ్‌’ను (ఈహెచ్‌ఎస్‌) అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు వైద్యారోగ్యశాఖ జీవో నంబర్‌ 186ను విడుదల చేసింది. 2014 నుంచి ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు ఆశగా ఎదురుచూస్తున్న ఈహెచ్‌ స్కీంను సీఎం కేసీఆర్ ప్రకటించడంతో… ఉద్యోగులు, పెన్షనర్లతో పాటు వారి కుటుంబాల్లోని లక్షలాది మంది తమకు నచ్చిన చోట వైద్య సేవలను క్యాష్‌లెస్‌గా పొందొచ్చు.

ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై ఉద్యోగులు, పెన్షనర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సీఎం కేసీఆర్‌కు, రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతున్నారు. ఈ నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా సుమారు ఏడు లక్షల కుటుంబాలకు ప్రయోజనం చేకూరనున్నది. ఉద్యోగులు, పెన్షనర్ల కోసం ప్రత్యేక ఆరోగ్య పథకం అమలు చేయాలని మొదటి పీఆర్సీ కమిషన్‌ రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. పథకం అమలుకు ప్రత్యేక ట్రస్ట్‌ ఏర్పాటు చేసి ఉద్యోగులు, పెన్షనర్ల నుంచి కొంత మొత్తాన్ని, అంతే మొత్తంలో ప్రతి నెలా ప్రభుత్వం మ్యాచింగ్‌ గ్రాంట్‌గా ట్రస్ట్‌కు జమ చేయాలని పేర్కొన్నది. ఈ మేరకు తమ మూల వేతనంలో ఒక శాతం కాంట్రిబ్యుషన్‌ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని ఉద్యోగ సంఘాల ప్రతినిధులు ప్రభుత్వానికి గతంలో విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్‌ ఆదేశం మేరకు ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు నేతృత్వంలో ఆరోగ్యశ్రీ హెల్త్‌ కేర్‌ ట్రస్ట్‌ సీఈవో పలుమార్లు ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో చర్చలు జరిపారు. వారి ప్రతిపాదనలను పరిశీలించిన అనంతరం ప్రభుత్వానికి నివేదిక అందజేశారు.

ఈ నూతన ఆరోగ్య పథకం అమలుకు ప్రభుత్వం ప్రత్యేకంగా ఎంప్లాయీ హెల్త్‌కేర్‌ ట్రస్ట్‌ (ఈహెచ్‌సీటీ) పేరుతో ట్రస్ట్‌ ఏర్పాటు చేస్తుంది. ఉద్యోగులు, పెన్షనర్లు తమ కాంట్రూబ్యుషన్‌గా ట్రస్టుకు ప్రతి నెల నిర్దేశిత మొత్తాన్ని జమ చేస్తారు. ఈ మొత్తం ప్రతినెల వారి వేతనం నుంచి ఆటోమెటిక్‌గా ట్రస్ట్‌కు బదిలీ అవుతుంది. ప్రభుత్వం అంతే మొత్తాన్ని మ్యాచింగ్‌ గ్రాంట్‌గా జమ చేస్తుంది.

ట్రస్ట్‌ బోర్డు పనితీరు
ట్రస్ట్‌ బోర్డుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌) చైర్‌ పర్సన్‌గా వ్యవహరిస్తారు.
ప్రభుత్వం తరఫున ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, వైద్యారోగ్యశాఖ, విద్యాశాఖ, సాధారణ పరిపాలన శాఖల కార్యదర్శులు, హోంశాఖ ముఖ్య కార్యదర్శి, డైరెక్టర్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌, ఆరోగ్యశ్రీ సీఈవో సభ్యులుగా ఉంటారు.
ఈహెచ్‌ఎస్‌ సీఈవో సభ్యకార్యదర్శిగా ఉంటారు.
ఉద్యోగుల తరఫున ఆరుగురిని, పెన్షనర్ల తరఫున ఇద్దరిని ప్రభుత్వం నామినేట్‌ చేస్తుంది.
విధాన నిర్ణయాలకు సంబంధించి బోర్డ్‌ సభ్యులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు అందజేస్తారు.
ప్రభుత్వ ఉద్యోగిని సీఈవోగా నియమిస్తారు.
పథకం అమలుకు సంబంధించిన విధివిధానాలను ప్రత్యేకంగా విడుదల చేస్తారు.

మంత్రి హ‌రీశ్ రావు హ‌ర్షం
ఉద్యోగులు, పెన్ష‌న‌ర్ల‌కు నూత‌న ఎప్లాయిస్ హెల్త్ స్కీమ్ అమ‌లు చేయాల‌ని సీఎం కేసీఆర్ నిర్ణ‌యించ‌డంపై ఆర్థిక‌, వైద్యారోగ్య శాఖ‌ల మంత్రి హ‌రీశ్ రావు హ‌ర్షం వ్య‌క్తం చేశారు. ప్ర‌త్యేకంగా ట్ర‌స్ట్ ఏర్పాటు చేయ‌డంపై సీఎం కేసీఆర్ కు కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. ప్ర‌భుత్వ నిర్ణ‌యంతో రాష్ట్ర‌వ్యాప్తంగా ఉన్న ఉద్యోగులు, పెన్ష‌న‌ర్లు, వారి కుటుంబ స‌భ్యుల‌కు మెరుగైన వైద్య సేవ‌లు అంద‌నున్నాయ‌న్నారు. ఉద్యోగులు, పెన్ష‌న‌ర్ల సంక్షేమానికి క‌ట్టుబ‌డి ఉన్నామ‌ని, త‌మ‌ది ఎంప్లాయి ఫ్రెండ్లీ ప్ర‌భుత్వ‌మ‌ని సీఎం కేసీఆర్ మ‌రోసారి నిరూపించారని స్ప‌ష్టం చేశారు.

Latest News

More Articles