Saturday, May 18, 2024

నేడు వరంగల్ పర్యటనకు మంత్రి కేటీఆర్.. రోజంతా బిజీ షెడ్యూల్

spot_img

మంత్రి కేటీ రామారావు శనివారం వరంగల్‌ జిల్లాకు రానున్నారు. ఆయన పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం, శంకుస్థాపన కార్యక్రమాల్లో పాల్గొంటారు. గీసుగొండ మండలంలోని కాకతీయ మెగా టెక్స్‌టైల్‌ పార్కులో యంగ్‌వన్‌ కంపెనీ ఎవర్‌ టాప్‌ టెక్స్‌టైల్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ పేరుతో చేపట్టే వస్త్ర పరిశ్రమల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేస్తారు. పార్కులో రూ.840కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు యంగ్‌వన్‌ కంపెనీ ముందుకొచ్చింది. ఈ నేపథ్యంలో టీఎస్‌ఐఐసీ టెక్స్‌టైల్‌ పార్కులో యంగ్‌వన్‌ కంపెనీకి ఇటీవల 298 ఎకరాలను కేటాయించింది. తమ వస్త్ర పరిశ్రమల్లో 11,700 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగం కల్పించనున్నట్లు సౌత్‌కొరియాకు చెందిన యంగ్‌వన్‌ కంపెనీ పేర్కొంది. పరోక్షంగా మరో 11,700 మందికి ఉపాధి లభించనుందని అధికారులు భావిస్తున్నారు.

భూమిపూజ అనంతరం మంత్రి కేటీఆర్‌ కొద్దిసేపు కంపెనీ ప్రతినిధులు, పార్కులో వస్త్ర పరిశ్రమలను నిర్మిస్తున్న ఇతర కంపెనీల ప్రతినిధులతోనూ మాట్లాడుతారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, కలెక్టర్‌ ప్రావీణ్య కార్యక్రమంలో పాల్గొంటారు. పార్కు నుంచి మంత్రి కేటీఆర్‌ హెలిక్యాప్టర్‌ ద్వారా ఖిలావరంగల్‌కు చేరుకుంటారు. వరంగల్‌ తూర్పు నియోజకవర్గం పరిధిలోని ఓసిటీలో నిర్మాణం పూర్తి చేసుకున్న ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని ప్రారంభిస్తారు. ఆజంజాహీ మిల్స్‌ గ్రౌండ్‌లో సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం (ఐడీవోసీ) నిర్మాణానికి మంత్రి కేటీఆర్‌ శంకుస్థాపన చేస్తారు.

ఐడీవోసీ నిర్మాణం కోసం ప్రభుత్వం మిల్స్‌ గ్రౌండ్‌లో సుమారు పద్దెనిమిది ఎకరాల భూమిని కేటాయించింది. ఇటీవల రూ.80 కోట్లను కూడా మంజూరు చేయడంతో ఆర్‌అండ్‌బీ శాఖ టెండర్ల ప్రక్రియ నిర్వహించింది. ఐడీవోసీతో పాటు ఉన్నతాధికారుల క్వార్టర్లను ఇక్కడే నిర్మించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. దేశాయిపేట వద్ద రూ.12.60 కోట్లతో ప్రభుత్వం నిర్మించిన 200 డబుల్‌ బెడ్‌రూం ఇండ్లను, వరంగల్‌లో రూ.135 కోట్లతో చేపట్టిన పదహారు స్మార్టు రోడ్లను కూడా వరంగల్‌చౌరస్తా వద్ద కేటీఆర్‌ ప్రారంభిస్తారు. రూ.75 కోట్లతో వరంగల్‌ మోడల్‌ బస్‌స్టేషన్‌, రూ.313 కోట్లతో ఇన్నర్‌ రింగ్‌రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేస్తారు. అనంతరం ఆజంజాహీ మిల్స్‌ గ్రౌండ్‌లో భారీ బహిరంగ సభ జరుగనుంది. యాభై వేల మందితో ఈ సభ నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్‌ ప్రకటించారు.

ఈ మేరకు బీఆర్‌ఎస్‌ శ్రేణులు జన సమీకరణలో తలమునకలయ్యాయి. సాయంత్రం 6.30 గంటలకు ప్రారంభమయ్యే ఈ సభలో మంత్రి కేటీఆర్‌ ప్రసంగిస్తారు. ఆయనతో పాటు మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, స్థానిక ప్రజాప్రతినిధులు, బీఆర్‌ఎస్‌ పార్టీ ముఖ్యనేతలు సభలో పాల్గొంటారు. సభా స్థలిని శుక్రవారం మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. ఎమ్మెల్యే నరేందర్‌ ఆయన వెంట ఉన్నారు. కేటీఆర్‌ పర్యటనను సందర్భంగా నగరం గులాబీమయమైంది. రహదారులు, జంక్షన్లలో గులాబీ జెండాలు, సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌తో పాటు బీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధుల ఫ్లెక్సీలు, కటౌట్లు వెలిశాయి. సభా స్థలి వద్ద ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాల ఫొటోలతో కూడిన ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. బీఆర్‌ఎస్‌ నేతల్లో నూతనోత్సాహం కనబడుతున్నది.

కేటీఆర్ పర్యటన ఫుల్ షెడ్యూల్‌..

ఉదయం 8.15 గంటలకు హైదరాబాద్‌ బేగంపేటలోని క్యాంపు ఆఫీసు నుంచి మంత్రి కేటీఆర్‌ బయల్దేరుతారు
8.30 బేగంపేట ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు
9.30 హెలిక్యాప్టర్‌ ద్వారా గీసుగొండ మండలంలోని కాకతీయ మెగా టెక్స్‌టైల్‌ పార్కుకు వస్తారు
9.30 పార్కులో యంగ్‌వన్‌ కంపెనీ పరిశ్రమలకు శంకుస్థాపన చేస్తారు
11.45 పార్కు నుంచి హెలిక్యాప్టర్‌ ద్వారా బయల్దేరుతారు
మధ్యాహ్నం 12 గంటలకు ఖిలావరంగల్‌ చేరుకుంటారు
12.15కు వరంగల్‌ ఓ సిటీలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ప్రారంభం
12.45 ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసు వద్ద లంచ్‌
1.30 సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం నిర్మాణానికి శంకుస్థాపన, భూమిపూజ
2.00 దేశాయిపేటలో డబుల్‌ బెడ్‌రూం ఇండ్ల ప్రారంభం
2.30 దేశాయిపేటలో జిల్లా వర్కింగ్‌ ఉమెన్‌ హాస్టల్‌ ప్రారంభం
2.45 కొత్తవాడలో కొండా లక్ష్మణ్‌ బాపూజీ, చేనేతన్న విగ్రహాల ఆవిష్కరణ
3.15 మండిబజార్‌ వద్ద మైనారిటీ డెవలప్‌మెంట్‌ పనులకు శంకుస్థాపన
3.30 : పోచమ్మమైదాన్‌ వద్ద హరిత హోటల్‌ నిర్మాణానికి శంకుస్థాపన
3.45 : వరంగల్‌ క్రాస్‌ రోడ్డు వద్ద 16 స్మార్టు రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన
4.00 : వరంగల్‌లో మోడల్‌ బస్‌స్టేషన్‌ నిర్మాణ పనులకు శంకుస్థాపన
4.30 : ఆర్టీవో ఆఫీసు జంక్షన్‌ వద్ద ఇన్నర్‌ రింగ్‌రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన
4.45 : ఉర్సులో వ్యర్థ జలాలను శుద్ధి చేసే ప్లాంటు ప్రారంభం
5.00 : రంగలీల మైదానం వద్ద ఉర్సు బండ్‌ డెవలప్‌మెంట్‌ ప్రారంభం.. కుడా కల్చరల్‌ సెంటర్‌ శంకుస్థాపన, జీవో 58 కింద ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ, వాటర్‌ సప్లయ్‌ ఇంప్రూవ్‌మెంట్‌ ప్రారంభం, పట్టణ ప్రగతి అభివృద్ధిపనులకు శంకుస్థాపన
5.30 : ఉర్సు దర్గాలో పనుల ప్రారంభం
6.00 ఖిలావరంగల్‌లో ఫకాడ్‌ లైటింగ్‌, హై-టీ కార్యక్రమం
6.30 ఓ సిటీ సమీపంలో బహిరంగ సభ
7.00 ఓ సిటీ నుంచి రోడ్డు మార్గంలో హైదరాబాద్‌ పయనం
10.00 హైదరాబాద్‌ బేగంపేటలోని సీఎం క్యాంపు ఆఫీసు చేరుకుంటారు.

Latest News

More Articles