పత్తి విత్తనాలు అధిక ధరలకు అమ్మితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. పత్తి సాగుకు రైతులు ఉపయోగించేది బీజీ ఐఐ హైబ్రిడ్ విత్తనాలని.. అన్ని కంపెనీల పత్తి విత్తనాలు ఒక్కటే రకమైనవేనని చెప్పారు. ప్రైవేటు కంపెనీలు ఉత్పత్తి చేసే ఈ విత్తనాల 400 గ్రాముల ప్యాకెట్ ధరను కేంద్ర ప్రభుత్వం గరిష్టంగా రూ.450 గా నిర్ణయించిందన్నారు. పత్తి విత్తనాల ధరను నిర్ణయించేది కేంద్ర ప్రభుత్వమే అయినప్పటికీ వాటి నియంత్రణ రాష్ట్రాల చేతుల్లోనే ఉంటుందని స్పష్టం చేశారు మంత్రి నిరంజన్ రెడ్డి. అయితే కొన్ని కంపెనీలు పత్తి విత్తనాల కృత్రిమ కొరత సృష్టించి ఎక్కువ ధరకు అమ్ముతున్నట్లు ప్రభుత్వం దృష్టికి వచ్చిందన్నారు. అలాంటి డీలర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని.. అవసరమైతే వాళ్ల లైసెన్స్ లు రద్దు చేయడానికి కూడా వెనుకాడమని తేల్చి చెప్పారు.
విత్తనాలు దొరకవేమో అని రైతులు కంగారు పడొద్దని.. అవసరమైన దానికంటే అధికంగానే పత్తి విత్తనాలు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయని తెలిపారు మంత్రి నిరంజన్ రెడ్డి. ఈ సీజన్ లో 65 లక్షల ఎకరాల్లో పత్తి సాగవుతుందని అంచనా వేశారని.. అంటే 58,500 క్వింటాళ్ల విత్తనాలు అవసరమవుతాయన్నారు. అయితే మార్కెట్లో అన్ని కంపెనీల విత్తనాలు కలిపి 77,500 క్వింటాళ్ల వరకు అందుబాటులో ఉన్నాయని తెలిపారు మంత్రి.