ప్రధాని మోడీ, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తో తెలంగాణకు మేలు జరుగదని తెలిపారు మంత్రి, మహేశ్వరం బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి సబితా ఇంద్రారెడ్డి. మహేశ్వరం నియోజక వర్గంలోని రావిర్యాల, మోహబత్ నగర్, తుమ్మలూరు, ఎన్డీ తండా, కేసీ తండా, మహేశ్వరం టౌన్, బడంగ్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పలు డివిజన్లలో మంత్రి రోడ్ షోలో పాల్గొని మాట్లాడారు. ముఖ్య మంత్రి కేసీఆర్ వల్లనే తెలంగాణ రాష్ట్రానికి న్యాయం జరుగుతుంది. కాంగ్రెస్ వస్తే కరెంటు ఉండదని, బీజేపీ వస్తే మతం, కులం అంటు అంతరాలు పెంచి ప్రజల మధ్య చిచ్చు పెడుతారని ఆరోపించారు.
ఇది కూడా చదవండి: బీజేపీ, కాంగ్రెస్ను నమ్మితే భవిష్యత్ అంధకారం
తెలంగాణలో జరుగుతున్న సంక్షేమం, అభివృద్ధి ఏ రాష్ట్రంలో లేదన్నారు మంత్రి సబిత ఇంద్రారెడ్డి. కరోనా, వరద సమయంలో ప్రజలు కష్టాలతో అల్లాడుతుంటే బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నాయకులు ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు. ఓట్ల కోసం ప్రజలను మోసం చేయడానికి వస్తున్నారని విమర్శించారు. నిరంతరం ప్రజల కోసం పనిచేస్తున్న వారికి ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. బడంగ్పేట, మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న కాలనీలను బంజారహిల్స్ కు దీటుగా అభివృద్ధి చేయిస్తానని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి మహేశ్వరం సరిహద్దులు తెలియవని అలాంటి వ్యక్తికి ఓటేస్తే ఓటు విలువ పడిపోతుందన్నారు.
సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధిని చూసి కారు గుర్తుకు ఓటు వేయాలని పిలుపునిచ్చారు మంత్రి సబితా ఇంద్రారెడ్డి. కేసీఆర్ మరోసారి అధికారంలోకి వస్తే గ్యాస్ రూ.400కే ఇస్తుందని, రెండు వేల ఫించన్ను రూ.5వేలు అందిస్తుందని చెప్పారు.
ఇది కూడా చదవండి: 24 గంటల కరెంటు అక్కర్లేదన్న కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్