ఎన్నికలు దగ్గర పడుతుండడంతో ప్రతిపక్షాల నేతలు మాయమాటలు చెప్తారని, వారి మాటలు నమ్మి మోసపోవద్దన్నారు మంత్రి వేములు ప్రశాంత్ రెడ్డి. నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలోని వేల్పూర్ మండలం పడగల్ గ్రామంలో ఇవాళ(బుధవారం) లబ్ధిదారులకు డబుల్ బెడ్రూమ్ పట్టాలను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… పడగల్ గ్రామాభివృద్ధి, సంక్షేమం కోసం 71కోట్ల రూపాయలు ఖర్చు చేశాం. 14 ఏళ్లపాటు సీఎం కేసీఆర్ ఏకైక లక్ష్యంతో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన ధీరుడు. ఉద్యమంలో రాజకీయ పార్టీల ఉద్దండులతో ఎన్నో ఇబ్బందులను ఎదిరించి నాలుగు కోట్ల ప్రజానీకాన్ని ఏకం చేసి రాజకీయ పార్టీల మెడలు వంచి కేసీఆర్ తెలంగాణ సాధించారు. తెలంగాణ సాధనతోనే నేడు గ్రామాల్లో అభివృద్ధి, సంక్షేమ పథకాలు పెద్ద ఎత్తున అందించగలుగుతున్నామన్నారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుతో ఏ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయలేనన్ని సంక్షేమ పథకాలను తెలంగాణలో కేసీఆర్ అమలు పరుస్తున్నారని తెలిపారు మంత్రి ప్రశాంత్ రెడ్డి. సీఎం కేసీఆర్ ఇచ్చిన మాట నిలబెట్టుకునే మహత్తరమైన శక్తి అని అన్నారు. ఎన్నికల సమయం ఆసన్నం కావడంతో ఎన్నో రాజకీయ పార్టీల నాయకులు గ్రామాల్లో తిరుగుతూ ఏదో చేస్తామని ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు మంత్రి. డబుల్ బెడ్రూమ్ పథకం రాష్ట్రంలో అమలు చేసినప్పుడు ఎంతోమంది అపహాస్యం చేశారని.. నేడు కొంత ఆలస్యమైనా రాష్ట్ర మంతటా డబుల్ బెడ్రూములు నిర్మించామని, వాటి ఫలాలు నేడు పేదలకు అందుతున్నాయన్నారు. కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకం ద్వారా నిరుపేదలైన ఎంతోమంది ఆడబిడ్డల వివాహాలకు డబ్బులను అందించడం జరుగుతోందన్నారు మంత్రి ప్రశాంత్ రెడ్డి.