సిద్దిపేట జిల్లా కేంద్రానికి సమీపంలో ఉన్న నాగులబండ వద్ద రూ.63 కోట్లతో నిర్మించిన ఐటీ టవర్ ని మంత్రులు హరీశ్ రావు, కేటీఆర్ ప్రారంభించారు. అంతకుముందు ఇర్కోడ్లో రూ.6 కోట్ల వ్యయంతో నూతనంగా నిర్మించిన మోడ్రన్ స్లాటర్ హౌస్ను, అందులో ఏర్పాటు చేసిన జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ మహిళా ఉత్పత్తులు, ఇర్కోడ్ నాన్వెజ్ పచ్చళ్లు, పంచాయతీరాజ్ శాఖ సేంద్రియ ఎరువుల స్టాళ్లను మంత్రులు ప్రారంభించారు. అనంతరం సిద్దిపేట పట్టణంలో బీటీ, సీసీ రోడ్లకు, నర్సాపూర్ వద్ద గల కప్పలకుంట సుందరీకరణ పనులకు శకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో సిద్దిపేట జిల్లా పరిషత్ చైర్పర్సన్ వేలేటి రోజా రాధాకృష్ణ శర్మ, జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జే పాటిల్, ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్, తదితతలు పాల్గొన్నారు.
ఐటీ హబ్ను విస్తరిస్తం: కేటీఆర్
సిద్దిపేటకు సీఎం కేసీఆర్ బలమైన పునాది వేశారు. తెలంగాణకు ఆయువుపట్టు సిద్దిపేట గడ్డ. ఐటీ టవర్ ప్రారంభంతో సిద్దిపేటలో 1500 మందికి ఉపాధి వచ్చింది. సిద్దిపేటకు పెద్ద ఎత్తున పరిశ్రమలు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తాం. ఐటీ టవర్ ప్రారంభం రోజునే సంస్థలు వచ్చి ఉద్యోగాలు ఇవ్వడం చాలా గొప్ప పరిణామం. ఐటీ హబ్కు మరిన్ని నిధులు మంజూరు చేసి విస్తరిస్తాం. సిద్దిపేటలో టీ హబ్ ఏర్పాటు చేస్తాం. 2014లో రాష్ట్రం ఏర్పడిన నాడు రాష్ట్రంలో ఐటీ ఎగుమతులు కేవలం రూ. 56 వేల కోట్లు మాత్రమే. ఇవాళ రూ. 2.41 లక్షల కోట్ల ఐటీ ఎగుమతులకు చేరుకున్నామని కేటీఆర్ తెలిపారు.
అంతకుముందు సిద్దిపేట ఐటీ టవర్లో భాగస్వామ్యం అయ్యేందుకు వచ్చిన కంపెనీలకు రెండేండ్లపాటు ఉచితంగా నిర్వహణ, అద్దె, విద్యుత్తు, ఇంటర్నెట్ బిల్లులు భారం లేకుండా చూస్తామని మంత్రి హరీశ్రావు భరోసా ఇచ్చారు.