హైదరాబాద్లో జరగాల్సిన ఫార్ములా ఈ రేస్ను రద్దు చేస్తున్నట్లు ఫార్ములా ఈ రేస్ నిర్వాహకులు ప్రకటించారు. ఈ-రేస్ సీజన్ 10కు చెందిన నాలుగవ రౌండ్ హైదరాబాద్లో ఫిబ్రవరి 10వ తేదీన జరగాల్సి ఉంది. తెలంగాణ ప్రభుత్వానికి చెందిన మున్సిపల్ శాఖ.. హోస్ట్ సిటీ ఒప్పందాన్ని ఉల్లంఘించిందని నిర్వాహకులు తెలిపారు. గత ఏడాది అక్టోబర్ 30న జరిగిన ఒప్పందాన్ని మున్సిపల్ శాఖ ఉల్లంఘించినట్లు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అదేవిధంగా రేస్ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన ఫార్ములా ఈ ఆపరేషన్స్.. మున్సిపల్ శాఖకు నోటీసులు జారీ చేసినట్లు చెప్పింది. కాంట్రాక్టును ఉల్లంఘించినందుకు నోటీసులు ఇచ్చినట్లు పేర్కొన్నది. హోస్ట్ సిటీ అగ్రిమెంట్ చట్టాల ప్రకారం చర్యలు తీసుకోనున్నట్లు ఎఫ్ఈవో తెలిపింది.
We have announced an update to the Season 10 calendar, with the cancellation of the Hyderabad E-Prix, scheduled for Saturday 10th February.
— Formula E (@FIAFormulaE) January 5, 2024
గత తెలంగాణ సర్కార్, ఫార్ములా ఈ మధ్య ఈరేస్ ఒప్పందం జరిగింది. కానీ ప్రస్తుతం తెలంగాణ సర్కార్ ఆ ఒప్పందాన్ని బ్రేక్ చేసింది. సీజన్ 10 రేస్లు జరగనున్న నగరాల్లో టోక్యో, షాంఘై, బెర్లిన్, మొనాకో, లండన్ నగరాలు ఉన్నాయి. జనవరి 13వ తేదీ నుంచి ఈ సీజన్ ప్రారంభంకానున్నది. మెక్సికోలోని హాంకూక్ లో తొలి రేస్ జరగనున్నది.
తెలంగాణ సర్కారు తీసుకున్న తాజా నిర్ణయం తమను నిరాశపరిచినట్లు ఫార్ములా-ఈ చీఫ్ చాంపియన్షిప్ ఆఫీసర్ ఆల్బర్టో లాంగో తెలిపారు. భారత్లో మోటర్స్పోర్ట్స్ అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసినట్లు చెప్పారు. వరల్డ్ చాంపియన్షిప్ రేస్ ఈవెంట్ను హైదరాబాద్లో నిర్వహించడం కీలకమైందని, కానీ దురదృష్టవశాత్తు తెలంగాణలో ఏర్పడ్డ కొత్త సర్కార్ నిర్ణయం వల్ల ఆ ఈవెంట్ను నిర్వహించలేకపోతున్నట్లు ఆల్బర్టో తెలిపారు.
గత ఏడాది జరిగిన ప్రారంభోత్సవ రేస్ చాలా సక్సెస్ అయ్యిందని, ఆ రేస్ వల్ల ఆ ప్రాంతంలో సుమారు 84 మిలియన్ల డాలర్ల ఆర్థిక ప్రగతి జరిగిందని ఫార్ములా ఈ సీఈవో జెఫ్ డోడ్స్ తెలిపారు. ఈవెంట్ రద్దు కావడంతో భారతీయ భాగస్వాములు మహేంద్ర, టాటా కమ్యూనికేషన్స్ సంస్థలను అసంతృప్తికి గురి చేసినట్లు అయిందన్నారు.
కాగా.. ఫార్ములా – ఈ-రేస్ రద్దు చేయడం పట్ల మాజీ మంత్రి కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న దుర్మార్గమైన, తిరోగమన నిర్ణయమని ధ్వజమెత్తారు. హైదరాబాద్ ఇ-ప్రిక్స్ వంటి ఈవెంట్లు మన నగరం, దేశ బ్రాండ్ ఇమేజ్ను ప్రపంచవ్యాప్తంగా పెంచుతాయన్నారు. హైదరాబాద్ను ఆకర్షణీయమైన పెట్టుబడి గమ్యస్థానంగా ప్రదర్శించడానికి EV ఔత్సాహికులు, తయారీదారులు మరియు స్టార్టప్లను ఆకర్షిస్తూ ఒక వారం పాటు EV సమ్మిట్ను నిర్వహించడానికి కేసీఆర్ ప్రభుత్వం ఫార్ములా ఈ-రేస్ను ఒక సందర్భంగా ఉపయోగించుకుందని తెలిపారు. సస్టైనబుల్ మొబిలిటీ సొల్యూషన్స్కు కేంద్రంగా రాష్ట్రాన్ని ప్రోత్సహించడానికి తాము తెలంగాణ మొబిలిటీ వ్యాలీని కూడా ప్రారంభించామని గుర్తు చేశారు.
This is truly a poor and regressive decision by the Congress Government
Events like Hyderabad E-Prix enhance the brand image of our City and Country across the world. We had put in a lot of effort and time to bring Formula E-Prix for the first time to India 🇮🇳
In a world… https://t.co/8tCIBEcgB5
— KTR (@KTRBRS) January 6, 2024