బీఆర్ఎస్ అధిష్టానం ఆదేశిస్తే మల్కాజిగిరి లోక్సభ బరిలో ఉంటానని మాజీ మంత్రి, ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి అన్నారు. గురువారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. గతంలో మల్కాజిగిరి ఎంపీగా పనిచేసిన అనుభవం ఉందని గుర్తు చేశారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలైన మేడ్చల్, మల్కాజిగిరి, ఉప్పల్, కూకట్పల్లి, కుత్బుల్లాపూర్ నియోజకవర్గాల్లో ఇటివల జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు భారీ మెజార్టీతో విజయం సాధించారన్నారు.
రానున్న లోక్ సభ ఎన్నికల్లో ఇదే తరహలో ప్రజలు బీఆర్ఎస్ను ఆదరిస్తారన్నారు. మల్కాజిగిరి లోక్సభ స్థానంతో పాటు రాష్ట్రంలో అత్యధిక లోక్సభ స్థానాలను బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందని దీమాను వ్యక్తం చేశారు. ఇప్పటికే బీఆర్ఎస్ అధిష్టానం ఎంపీ స్థానాల గెలుపుపై ఫోకస్ చేసిందన్నారు.
లోక్సభ స్థానాల వారీగా సమీక్షలు నిర్వహించి బీఆర్ఎస్ పార్టీ గెలుపే లక్ష్యంగా పనిచేయనున్నట్లు వెల్లడించారు. తాను పోటీ చేసే విషయమై అధిష్టానం నిర్ణయం తీసుకుంటుదని పేర్కొన్నారు. మల్కాజిగిరి పార్లమెంట్ సమీక్షా సమావేశం ఈ నెల 21 తెలంగాణ భవన్లో పార్లమెంట్ పరిధిలోని ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, ముఖ్యనాయకులతో అదిష్టానం నిర్వహిస్తుందని మల్లారెడ్డి చెప్పారు.