మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత మల్లారెడ్డి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. మేడ్చల్ జిల్లా శామీర్పేట పోలీసులు తనపై నమోదు చేసిన కేసు అక్రమమని, దీనిని కొట్టివేయాలంటూ ఆయన పిటిషన్ వేశారు. జస్టిస్ సురేందర్ ముందుకు ఈ పిటిషన్ సోమవారం విచారణకు వచ్చింది.
అయితే రాజకీయ నాయకుల కేసులను విచారించే బెంచ్ ముందుకు ఈ పిటిషన్ను తీసుకెళ్లాలంటూ రిజిస్ట్రీని జడ్జి ఆదేశించి, కేసు విచారణను వాయిదా వేశారు. కాగా మేడ్చల్ మండలం మూడుచింతపల్లి మండలం కేశవాపురం గ్రామంలో భూములను కబ్జా చేశారంటూ మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత మల్లారెడ్డిపై కొంతకాలంగా ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల ఫిర్యాదు అందడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఇది అక్రమ కేసు అని మల్లారెడ్డి చెబుతున్నారు.