హైదరాబాద్: చిట్ చాట్ పేరిట తాను అనని మాటలను అన్నట్టు ప్రసార సాధనాల్లో జరుగుతున్న ప్రచారాన్ని ఎమ్మెల్సీ తక్కళ్ళపల్లి రవీందర్ రావు తీవ్రంగా ఖండించారు. తాను ఏదైనా మాట్లాడాలనుకుంటే అధికారికంగా ప్రెస్ మీట్ నిర్వహించే మాట్లాడుతానని, కానీ చిట్ చాట్ లో మాట్లాడనని పేర్కొన్నారు.
తమ పార్టీ అధినేత కేసీఆర్ పై సంపూర్ణ విశ్వాసం ఉందని, ఆయన అప్పజెప్పిన ఎన్నో బాధ్యతలను చిత్తశుద్ధితో నెరవేర్చినట్లు తెలిపారు. ఎన్నికల్లో గెలుపు ఓటములు సహజమన్నారు. ఓటమికి కారణాలు ఏవైనా ఉంటే తాను పార్టీ వేదికల్లో చెబుతాను తప్ప చిట్ చాట్ తదితర రూపాల్లో కాదని స్పష్టం చేశారు. తాను ప్రెస్ మీట్ పెట్టి చెప్పే విషయాలనే తన వ్యాఖ్యలుగా పరిగణించాలి తప్ప తన చిట్ చాట్ పేరిట జరుగుతున్న దుష్ప్రచారాన్ని నమ్మ వద్దని విజ్ఞప్తి చేశారు.