దేశాన్ని ఊపెస్తున్న మహిళా రెజ్లర్ల వివాదం కొత్త మలుపు తిరిగింది. మహిళా రెజ్లర్లను లైంగికంగా వేధించాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ బ్రిజ్భూషణ్ శరన్ సింగ్ కు కేంద్రంతోపాటు ఢిల్లీ పోలీసులు కూడా కొమ్ముకాస్తున్నట్లు కనిపిస్తున్నది.
బ్రిజ్భూషణ్ తాకరాని చోట తాకినట్లుగా చూపే ఫొటో, వీడియో లేదా ఆడియో ఆధారాలు ఉంటే ఇవ్వాలని.. బాధితులైన ఇద్దరు మహిళా రెజ్లర్లను పోలీసులు కోరడం వివాదంగా మారింది. ఈ విషయాన్ని ఓ జాతీయ పత్రిక వెలుగులోకి తీసుకొచ్చింది. బ్రిజ్భూషణ్ తమను 2016 -2019 మధ్య లైంగికంగా వేధించాడని ఈ ఏడాది ఏప్రిల్ 28న ఇద్దరు మహిళా రెజ్లర్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
రెజ్లర్ల నుంచి ఫిర్యాదు తీసుకున్న పోలీసులు నిందితుడిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు. దీంతో రెజ్లర్లు తమకు న్యాయం కావాలంటూ జంతర్ మంతర్ వద్ద నెలరోజులకుపైగా ఆందోళనకు దిగినా కేంద్రంలో చలనం రాలేదు. నూతన పార్లమెంట్ ప్రారంభం రోజు రెజ్లర్లు ధర్నాకు ప్రయత్నించడంతో పోలీసులు అమానుషంగా వాళ్లను ఈడ్చిపారేయడంపై దేశ వ్యాప్తంగా నిరసన వ్యక్తమైంది. దిగొచ్చిన కేంద్రం ఈ నెల 15లోగా కేసు విచారణ పూర్తి చేయిస్తామని హామీ ఇవ్వడంతో రెజ్లర్లు తాత్కాలికంగా ఆందోళన విరమించారు.