ప్రతి మహిళ అమ్మతనం ఆస్వాదించాలనుకుంటుంది. అందుకోసం 9 నెలలు ఓపికగా భరించి, బిడ్డను కంటుంది. అయితే ఆ బిడ్డను కనేందుకు జైలులో ఉన్న భర్తను విడుదల చేయాలంటూ ఓ మహిళ కోర్టుకెక్కింది. ఈ ఘటన మధ్యప్రదేశ్ జరిగింది. స్థానికంగా నివసించే ఓ వ్యక్తి క్రిమినల్ కేసులో అరెస్టయి కొన్నేండ్లుగా జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. అయితే అతన్ని కొన్ని రోజుల పాటు బెయిల్ మీద విడుదల చేయాలంటూ అతని భార్య హైకోర్టులో పిటిషన్ వేసింది. తాను తల్లిని కావాలనుకుంటున్నానని, అందుకోసం తన భర్తను జైలు నుంచి విడుదల చేయాలని ఆమె తన పిటిషన్లో తెలిపింది. కనీసం 15 నుంచి 20 రోజులపాటు తన భర్తను జైలు నుంచి విడుదల చేయాలని కోరింది. పిల్లలను కనడం తన ప్రాథమిక హక్కు అని ఆమె పిటిషన్లో పేర్కొంది.
Read Also: నేపాల్లో అర్ధరాత్రి భూకంపం విలయం .. 69 మంది మృతి
కాగా.. సదరు మహిళ పిటిషన్పై హైకోర్టు విచారణ జరిపింది. ఆమె భర్తను విడుదల చేస్తే పిటిషనర్ గర్భం దాల్చే అవకాశం ఉందా లేదా..? అని తెలుసుకోవాలని హైకోర్టు నిర్ణయించింది. సదరు పరీక్షల కోసం పిటిషనర్ ఈ నెల 7న జబల్పూర్ మెడికల్ కాలేజీ డీన్ ముందు హాజరు కావాలని ఆదేశించింది. ఆ మెడికల్ కాలేజీలో పరీక్షల అనంతరం ఆమెకు తల్లి అయ్యే అవకాశం ఉందని తేలితే కోర్టు తదుపరి నిర్ణయం తీసుకోనుంది.