ప్రముఖ ఫ్రాన్స్ కార్ల తయారీ సంస్థ సిట్రోన్ కీలక నిర్ణయం తీసుకున్నది. జార్ఖండ్ డైనమెట్ మహీంద్ర సింగ్ ధోనీని ప్రచారకర్తగా నియమించుకున్నట్లు సమాచారం. భారత్లో టాటా మోటార్స్, మారుతి సుజుకి వంటి కార్లతో ఎలక్ట్రిక్ కార్ల విక్రయాల్లో స్టెల్లాంటిస్ గ్రూప్ కంపెనీ సిట్రోన్ పోటీ పడుతున్నది. ప్రజల్లో, కార్ల ప్రేమికుల్లో తమ కార్ల పట్ల మరింత అవగాహన కల్పించేందుకు సిట్రోన్.. తమ ఉత్పత్తుల ప్రచారకర్తగా ఎంఎస్ ధోనీని ఎంచుకుంది. సిట్రోన్ కంపెనీకి ఎంఎస్ ధోనీ రెండేండ్ల పాటు ప్రచారకర్తగా ఉంటారు. ఇందుకోసం ఏటా రూ.7 కోట్లు ఎంఎస్ ధోనీకి సిట్రోన్ కంపెనీ చెల్లించనున్నదని తెలుస్తోంది.
ప్రస్తుతం సాగుతున్న ఐపీఎల్-2024 సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే)కు ప్రాతినిధ్యం వహిస్తున్న టీం ఇండియా మాజీ సారధి ధోనీ పలు కార్పొరేట్ సంస్థలకు ప్రచారకర్తగా ఉన్నారు. అమిటీ యూనివర్సిటీ, అమ్రపాలి, గల్ఫ్ ఆయిల్, అశోక్ లేలాండ్, డ్రీమ్11, ఓరియో, ఎక్సైడ్, అన్ అకాడమీ, ఇండియా సిమెంట్స్, మాస్టర్ కార్డ్ ఇండియా, కాల్గేట్, స్టార్ స్పోర్ట్స్, బిగ్ బజార్, టీవీఎస్ మోటార్స్, మ్యాక్స్ మొబైల్, బూస్ట్, సొనాటా వాచెస్, ఇండిగో పెయింట్స్, ఓరియంట్ సహా పలు సంస్థలకు ప్రచారకర్తగా ఉన్నారు. ఒక్కో సంస్థకు ప్రచారకర్తగా పని చేసేందుకు ఎంఎస్ ధోనీ ఏటా రూ.3.5-6 కోట్ల మధ్య వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది. 2021లో 54 సంస్థలకు ప్రచారకర్తగా టీవీల్లో కనిపించారు.
ఇది కూడా చదవండి: తెలంగాణలో నాలుగు రోజులు వానలు.. ఎల్లో అలెర్ట్ జారీ..!