ఖమ్మంలోని జిల్లా దవాఖానకు ‘బ్రెస్ట్ ఫీడింగ్ ఫ్రెండ్లీ’ గుర్తింపు దక్కింది. శిశువులకు పుట్టిన వెంటనే ముర్రుపాలు అందించటం, కనీసం ఆరు నెలల వరకు తల్లిపాలు మాత్రమే తాగే లా అవగాహన కల్పించటం ద్వారా తల్లి పాల ను ప్రోత్సహించే దవాఖానలకు ‘బేబీ/బ్రెస్ట్ ఫీడింగ్ ఫ్రెండ్లీ హాస్పిటల్ ఇనిషియేటివ్’ (బీఎఫ్హెచ్ఐ)లో భాగంగా ఈ సర్టిఫికెట్ అందజేస్తారు. ఖమ్మంతో కలిపి రాష్ట్రంలో ఆరు దవాఖానలు బీఎఫ్హెచ్ఐ గుర్తింపు పొందాయి. తద్వారా దేశంలోనే అత్యధిక బీఎఫ్హెచ్ఐ అక్రెడిటెడ్ ప్రభుత్వ దవాఖానలున్న రాష్ట్రంగా తెలంగాణ రికార్డు సాధించింది. సీఎం కేసీఆర్ నేతృత్వంలో రాష్ట్రంలోని ప్రజలకు మెరుగైన, నాణ్యమైన వైద్యసేవలు అందుతున్నాయనడానికి ఇది మరో నిదర్శనంగా నిలిచింది. బిడ్డ పుట్టిన అరగంటలోనే ముర్రుపాలు తాగించాలని, బిడ్డకు ఆరు నెలల వయసు వచ్చే వరకు తల్లిపాలు మాత్రమే తాగించాలని అనేక అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. తద్వారా ఐదేండ్లలోపు పిల్లల మరణాలను 22 శాతం నివారించవచ్చని చెప్తున్నాయి. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్రప్రభుత్వం తల్లిపాల వినియోగం, శిశుమరణాల నివారణకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టింది.
రాష్ట్ర ప్రభుత్వం ఎంసీహెచ్లు, ఎన్ఐసీయూలు వంటి సదుపాయాలు కల్పించింది. వైద్యసిబ్బంది, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్ల ద్వారా గర్భిణులకు, బాలింతలకు తల్లిపాల ఆవశ్యకతపై విసృ్తతంగా అవగాహన కల్పిస్తున్నది.
రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ దవాఖానలను బీఎఫ్హెచ్ఐ ప్రమాణాలకు అనుగుణంగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం నిర్ణయించింది. ‘బ్రెస్ట్ ఫీడింగ్ ప్రమోషన్ నెట్వర్క్ ఆఫ్ ఇండియా’ (బీపీఎన్ఐ) సహకారంతో 30 మందికి శిక్షణ ఇప్పించింది. ఇలా శిక్షణ ఇప్పించిన తొలిరాష్ట్రంగా కూడా రికార్డు సృష్టించింది. శిక్షణ పొందినవారు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సిబ్బందికి శిక్షణ ఇస్తున్నారు.
ప్రసవం అయిన గంటలోపే ఆపరేషన్ థియేటర్లో లేదా ప్రసూతి గదిలో శిశువులకు ముర్రుపాలు అందించాలని ఆదేశాలు జారీ చేసింది. తర్వాత ఆ తల్లుల కేస్షీట్లో ప్రత్యేకంగా ఆకుపచ్చ రంగులో ఉండే బ్రెస్ట్ ఫీడింగ్ స్టాంపులు వేస్తున్నారు. తద్వారా ఎంత మంది పిల్లలకు ముర్రుపాలు అందాయో పర్యవేక్షించేందుకు అవకాశం కలిగింది.
తల్లిపాలను ప్రోత్సహించేందుకు రెండు కాంప్రహెన్సివ్ లాక్టేషన్ మేనేజ్మెంట్ సెంటర్లు (సీఎల్ఎంసీ), రెండు లాక్టేషన్ మేనేజ్మెంట్ యూనిట్లను (ఎల్ఎంయూ) స్థాపించింది.
సివియర్ అక్యూట్ మాల్ న్యూట్రిషన్ (ఎస్ఏఎం), మోడరేట్ అక్యూట్ మాల్ న్యూ ట్రిషన్ (ఎంఏఎం) వంటి పోషకాహార లో ప వ్యాధుల బారిన పడే పిల్లలను గుర్తించి వారి ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నది.
రాష్ట్రంలోని ప్రభుత్వ దవాఖానల్లో అత్యధిక డెలివరీలు జరుగుతున్న 41 కేంద్రాలను ప్రభుత్వం గుర్తించింది. ఇక్కడ ప్రత్యేకంగా లాక్టేషన్ వర్కర్లను నియమించింది. వీరు మూడు షిప్టుల్లో అందుబాటులో ఉంటారు. తల్లిపాల గురించి ఏఎన్సీ, పీఎన్సీ చెకప్ల సమయంలో గర్భిణులు, బాలింతలకు అవగాహన కల్పిస్తారు.
మొదటి దశలో 50 ప్రభుత్వ దవాఖానలు బీఎఫ్హెచ్ఐ గుర్తింపు సాధించాలని నిర్ణయించింది.
ఈ ఏడాది ఫిబ్రవరిలో బాన్సువాడలోని ఎంసీహెచ్ మొదటి బీఎఫ్హెచ్ఐ సర్టిఫికెట్ సాధించింది. ఆ తర్వాత జనగాం ఎంసీహెచ్, గజ్వేల్ ఏరియా దవాఖాన, సూర్యాపేట ఎంసీహెచ్, జహీరాబాద్ ఏరియా దవాఖాన, ఖమ్మం జిల్లా దవాఖాన ఈ గుర్తింపు పొందాయి.
మరో తొమ్మిది దవాఖానలు అక్రెడిటేషన్ కోసం దరఖాస్తు చేసుకున్నాయి. వీటికి త్వరలోనే గుర్తింపు వస్తుందని అధికారులు చెప్తున్నారు.
వైద్య సిబ్బందికి అభినందనలు
ఖమ్మం ఎంసీహెచ్కు బీఎఫ్హెచ్ఐ అక్రిడిటేషన్ రావడం హర్షణీయం. దవాఖాన సిబ్బందికి ప్రత్యేక అభినందనలు. రాష్ట్రంలో మొత్తం ఆరు ప్రభుత్వ దవాఖానలు ఈ గుర్తింపు సాధించటం గొప్ప విషయం. సీఎం కేసీఆర్ సారథ్యంలో రాష్ట్రప్రజలకు మెరుగైన, నాణ్యమైన వైద్యసేవలు అందుతున్నాయని చెప్పడానికి ఇది మరో నిదర్శనం. రాష్ట్రప్రభుత్వం చేపట్టిన ఇలాంటి ప్రత్యేక కార్యాచరణ ఫలితంగా నవజాత శిశుమరణాలు, ఐదేండ్లలోపు పిల్లల మరణాలు తగ్గుముఖం పట్టాయి. – ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు.
బీఎఫ్హెచ్ఐ అంటే..
శిశువుల ఆరోగ్యాన్ని కాపాడేందుకు ప్రపంచ ఆరోగ్యసంస్థ 10 ప్రమాణాలను నిర్దేశించింది. మన దేశంలో తల్లిపాలను ప్రోత్సహించేందుకు ‘బ్రెస్ట్ఫీడింగ్ ప్రమోషన్ నెట్వర్క్ ఆఫ్ ఇండియా’ (బీపీఎన్ఐ) 30 ఏండ్లుగా పనిచేస్తున్నది. కేంద్రప్రభుత్వం బీపీఎన్ఐతో కలిసి ‘మదర్స్ అబ్సల్యూట్ అఫెక్షన్’ (మా) పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని అమలు చేస్తున్నది. యూనిసెఫ్, బీపీఎన్ఐ, అసోసియేషన్ ఆఫ్ హెల్త్ ప్రొవైడర్స్ ఇండియా (ఏహెచ్పీఐ) కలిసి జాతీయ, అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా తల్లిపాలను ప్రోత్సహిస్తున్న దవాఖానలను గుర్తిస్తాయి. ఆయా సంస్థలకు చెందిన ప్రత్యేక బృందం దవాఖానల్లో తనిఖీలు నిర్వహించి ప్రమాణాలు పాటిస్తున్నాయో లేదో పరిశీలిస్తాయి. ఉత్తమ సేవలు అందిస్తున్న దవాఖానలకు బీఎఫ్హెచ్ఐ అక్రెడిటేషన్ ఇస్తాయి. ఈ సర్టిఫికెట్ కాలపరిమితి మూడేండ్లు.