భారతీయ న్యాయ సంహిత (బిఎన్ఎస్) 2023లోని కఠినమైన నిబంధనలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ.. దేశవ్యాప్తంగా ఫిబ్రవరి 16న దేశవ్యాప్తంగా ఒకరోజు నిరసన సమ్మె చేయాలని దేశంలోని రోడ్డు రవాణా కార్మికులకు ఆలిండియా రోడ్డు రవాణ కార్మిక సంఘాల సమన్వయ కమిటీ పిలుపు ఇచ్చింది. ప్రస్తుత పార్లమెంట్ బడ్జెట్ సమావేశంల్లో అసంఘటిత రోడ్డు రవాణా కార్మికుల కోసం సామాజిక భద్రతా చట్టాన్ని రూపొందించాలని, కేంద్ర ప్రభుత్వ తప్పుడు విధానాల కారణంగా తీవ్రమైన సంక్షోభంలో ఉన్న రోడ్డు రవాణా రంగాన్ని రక్షించడానికి తగిన చర్యలు తీసుకోవాలని కమిటీ డిమాండ్ చేసింది. 16న సమ్మెలో రోడ్డు రవాణా రంగంలో పనిచేస్తున్న ఇతర సంఘాలన్నీ సమ్మెలో పాల్గొనవలసిందిగా కమిటీ సభ్యులు విజ్ఞప్తి చేశారు.
‘ఎంవి చట్ట సవరణ-2019తో ప్రస్తుతం ప్రభుత్వ యాజమాన్యంలో ఉన్న రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్లను నిర్వీర్యం చేస్తుంది. మొత్తం రోడ్డు రవాణా రంగాన్ని బడా కార్పొరేట్ సంస్థలకు అప్పగించడం లక్ష్యంగా పెట్టుకుంది” అని విమర్శించారు. ”నాలుగు లేబర్ కోడ్లు కార్మికులను యజమానులకు బానిసలను చేస్తాయి. నిత్యావసర వస్తువుల ధరలు దాదాపు రెట్టింపు అయ్యాయి. కొత్త విద్యుత్ బిల్లు, స్మార్ట్ మీటర్ల ప్రవేశం వల్ల ప్రజలపై పెనుభారం పడనుంది. నేషనల్ మానిటైజేషన్ పైప్ లైన్ (ఎన్ఎంపి) ప్రభుత్వ ఆస్తులను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించడం తప్ప మరొకటి కాదు. నిరుద్యోగం గరిష్ట స్థాయికి చేరుకుంది. ప్రభుత్వం అనుసరిస్తున్న ఈ విధానాలన్నీ రోడ్డు రవాణా రంగాన్ని, కార్మికులను ప్రభావితం చేస్తున్నాయి” అని విమర్శించారు. ఈ విధానాలను ప్రతిఘటించాల్సిన సమయం ఆసన్నమైంది. ఈ విధానాలను అనుమతించబోమని ప్రభుత్వానికి హెచ్చరించాలి. ఈ నేపథ్యంలో, ఫిబ్రవరి 16న జరిగే సమ్మెలో రోడ్డు రవాణా కార్మికులందరూ పాల్గొనవలసిందిగా మరోసారి విజ్ఞప్తి చేస్తున్నాం” అని చెప్పారు.
ఇది కూడా చదవండి: HMDA మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ అరెస్ట్