ఆరోగ్యబీమా చేయించుకున్నవారికి శుభవార్త. ఇకనుంచి బీమా ఉన్నవారు ఏ ఆస్పత్రిలోనైనా ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. దీనికి సంబంధించిన ఉత్తర్వులను ‘ది జనరల్ ఇన్సూరెన్స్ కౌన్సిల్’ వెల్లడించింది. దాంతో ఆరోగ్య బీమా తీసుకున్న వారు అన్ని ఆస్పత్రుల్లో ‘క్యాష్లెస్’ సదుపాయాన్ని వినియోగించుకోవచ్చు. గురువారం నుంచే ఈ సదుపాయం అందుబాటులోకి వచ్చింది. ఈ నిర్ణయంతో ఇన్సూరెన్స్ పాలసీ నెట్వర్క్ జాబితాలో పేరు లేని హాస్పిటల్లోనూ క్యాష్లెస్ సదుపాయాన్ని ఉపయోగించుకోవచ్చు.
Read Also: కొడుకు లవ్ మ్యారేజ్.. నువ్వే కారణమంటూ తిట్టడంతో సూసైడ్ చేసుకున్న తల్లి
అయితే నెట్వర్క్ హాస్పిటల్ జాబితాలో పేరు లేని ఆస్పత్రుల్లో క్యాష్లెస్ సదుపాయం పొందేందుకు 48 గంటల ముందు ఇన్సూరెన్స్ కంపెనీకి తెలియజేయాలి. అత్యవసర సమయాల్లో అయితే ఆస్పత్రిలో చేరిన 48 గంటల్లోపు సమాచారాన్ని చేరవేయాల్సి ఉంటుంది. ఇన్సూరెన్స్ పాలసీ షరతులు, నిబంధనల ఆధారంగా క్లెయిం వర్తిస్తుందని కౌన్సిల్ పేర్కొంది.
ప్రస్తుతం ఏదైనా హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుంటే నెట్వర్క్ హాస్పిటల్స్లో మాత్రమే క్యాష్లెస్కు అనుమతి ఉంది. క్యాష్లెస్ సదుపాయం లేని చోట ట్రీట్మెంట్కు అయ్యే ఖర్చును జేబులోంచి చెల్లించాల్సి ఉంటుంది. తర్వాత రీయింబర్స్మెంట్కు దరఖాస్తు చేసుకోవాలి. ఈ ప్రక్రియ సంక్లిష్టంగా ఉండడం, రిఫండ్ ప్రక్రియ ఆలస్యం కావడంతో కస్టమర్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక నుంచి ఈ సమస్యలు తప్పనున్నాయి.