పెళ్లి జీవితంలో ఒకసారి మాత్రమే చేసుకునే గొప్ప వేడుక. అందుకే ఈ వేడుక అందరికీ గుర్తిండిపోయేలా చేసుకుంటారు. అతిథుల కోసం పంచభక్ష పరమాన్నాలు వడ్డించి, వారి ఆశీర్వాదాలు తీసుకోవాలనుకుంటారు. పెళ్లి అనగానే అందరూ ఊహించేది వెజ్, నాన్ వెజ్, స్వీట్స్, రకరకాల వంటకాలు. అయితే ఒక్కోసారి పెళ్లిళ్లలో ఆహారం కొరత ఏర్పడుతుంది. చివరలో కొంతమందికి సరిపడా ఆహారం దొరకదు. ఆ సమయంలో ఉన్నవాటితోనే సరిపెడుతుంటారు. ఇక్కడే ఓ తంటా వచ్చి పడుతుంది. మనకు కావలసిన వారైతే.. ఏది ఉంటే అది తిని సర్దుకుంటారు. కానీ, కొంతమంది మాత్రం మాకు కచ్చితంగా ఆ ఆహరం కావలసిందే అంటూ గలాటాకు దిగుతుంటారు. అలా ఓ వివాహ కార్యక్రమంలో ఏర్పడిన రసగుల్లాల కొరత గొడవకు దారితీసింది.
Read Also: ప్రభుత్వ ఉద్యోగం కోసం తండ్రిని చంపాలనుకున్న కొడుకు
ఉత్తరప్రదేశ్లోని శంషాబాద్ ప్రాంతంలో ఆదివారం ఓ వివాహ కార్యక్రమం జరిగింది. ఈ వేడుకల్లో భాగంగా అతిథులకు పసందైన వంటకాలు వడ్డించారు. అయితే, కాసేపటికి పెళ్లి వేడుకలో వడ్డించిన రసగుల్లాలు అయిపోయాయి. దాంతో ఓ వ్యక్తి రసగుల్లాల లేవని ఆగ్రహం వ్యక్తం చేశాడు. అది కాస్తా పెద్దదై.. పెళ్లి కూతురు, పెళ్లి కొడుకు బంధువులు కొట్టుకున్నారు. ఈ గొడవలో ఆరుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. గాయపడిని వారిని భగవాన్ దేవి, యోగేష్, మనోజ్, కైలాష్, ధర్మేంద్ర, పవన్గా గుర్తించారు. వారిని వెంటనే చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు తెలిపారు.