Tuesday, May 21, 2024

సుపారీ ఇచ్చి మరీ కొడుకును హత్య చేయించిన తల్లిదండ్రులు

spot_img

ఏ తల్లిదండ్రులకైనా తమ పిల్లలంటే పంచప్రాణాలు. అందుకే పిల్లలు ఏం చేసినా కన్నవారికి తప్పులా అనిపించదు. కానీ, ఓ తల్లిదండ్రులు మాత్రం కొడుకు ప్రవర్తనతో విసిగిపోయి.. సుపారీ ఇచ్చి మరీ హత్య చేయించారు. ఈ ఘటన ఆంధ్ర-తెలంగాణ బార్డర్‎‎లో వెలుగుచూసింది.

భద్రాచలం మెడికల్‌ కాలనీకి చెందిన పగిల్ల రాము, సావిత్రిలకు దుర్గాప్రసాద్ (35) అనే కొడుకు ఉన్నాడు. అయితే దుర్గాప్రసాద్ మద్యానికి బానిసై, ఇష్టమొచ్చినట్లు తిరిగేవాడు. దాంతో అతనికి పెళ్లి చేస్తే కుదురుగా ఉంటాడని భావించి.. మౌనిక అనే యువతితో కొన్నేండ్ల క్రితం పెళ్లి జరిపించారు. కానీ, పెళ్లి తర్వాత కూడా దుర్గాప్రసాద్‎లో ఏ మాత్రం మార్పు రాలేదు. పెళ్లయిన కొద్ది రోజులకే భార్య.. భర్తను వదిలి పుట్టింటికి వెళ్లిపోయింది. ఇక దుర్గాప్రసాద్‎కు ఏ అడ్డూ లేకుండా అయింది. గతం కన్నా ఎక్కువగా తాగుతూ.. తల్లిదండ్రులతో గొడవపడేవాడు. తాగొచ్చి ఇంటిని అమ్మేయాలంటూ పోరు పెట్టుకునేవాడు. కొడుకు తీరుతో విసిగిపోయిన తల్లిదండ్రులు.. కన్నబంధాన్ని వద్దనుకున్నారు. కొడుకును అంతమొందించేందుకు భద్రాచలానికి చెందిన గుమ్మడి రాజు, షేక్‌ అలీ పాషాలకు రూ.3 లక్షల సుపారీ ఇచ్చారు.

పథకంలో భాగంగా.. ఈ నెల 9న అర్ధరాత్రి ఇంట్లో నిద్రిస్తున్న దుర్గాప్రసాద్‌ను సుపారీ గ్యాంగ్ కత్తితో గొంతు కోసి హత్య చేశారు. అనంతరం మృతదేహాన్ని తుమ్మలనగర్‌ అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి పెట్రోలు పోసి తగులబెట్టారు. అయితే కొద్ది రోజుల తర్వాత కట్టెల కోసం ఆ ప్రాంతానికి వెళ్లిన ఓ వ్యక్తి.. సగం కాలిపోయిన శవాన్ని చూసి పోలీసులకు సమాచారమిచ్చాడు. మృతదేహం ఫొటోతో చుట్టుపక్కల ప్రాంతాల్లో దర్యాప్తు జరపగా.. మృతుని భార్య ఆ ఫొటో తన భర్తదేనని గుర్తుపట్టింది. దాంతో దుర్గాప్రసాద్ తల్లిదండ్రులను విచారణ చేయగా.. అసలు విషయం బయటపడింది. మృతుడి తల్లిదండ్రులతో పాటు సుపారీ గ్యాంగ్‎ను పోలీసులు అరెస్ట్ చేశారు.

మరిన్ని వార్తలు..

Latest News

More Articles