పెన్షన్ దారులు రోడ్డెక్కారు. నెలనెలా అందాల్సిన పెన్షన్ అందక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆసరా ఫించన్లు రాక ఇబ్బంది పడుతున్నామంటూ బాధితులు వాపోతున్నారు. జనవరి నెల ఆసరా పెన్షన్ అందలేదని..ఫిబ్రవరి నెల కూడా వస్తుందన్న గ్యారెంటీ లేదంటూ శుక్రవారం నారాయణపేట జిల్లా బాజాపూర్ గ్రామంలో పెన్షన్ దారులు రోడ్డుపై నిరసన తెలిపారు. ప్రభుత్వం ఆలస్యంగా ఇవ్వడం పోస్టాపీసులో బీపీఎంను తొలగించడం వంటి సమస్యతో పింఛన్లు అందడం లేదని నిరసన వ్యక్తం చేశారు.
స్థానిక గ్రామపంచాయితీ భవనం ఎదుట మహబూబ్ నగర్ హైదరాబాద్ యాద్గీర్ ప్రధాన రహదారిపై పెన్షన్ దారులు బైఠాయించారు. దీంతో గంటపాటు వాహనాలు నిలిచిపోయాయి. పోలీసులు గ్రామానికి చేరుకుని సంబంధిత పోస్టల్ అధికారులకు సమాచారం అందించారు. పెన్షన్లు అందిస్తామని పోస్టల్ అధికారులు హామీ ఇవ్వడంతో పెన్షన్ దారులు నిరసన విరమించారు. నారాయణపేట ఎంపీడీవో వెంకయ్య గ్రామానికి చేరుకుని కారణాలను అడిగి తెలుసుకున్నారు.
ఇది కూడా చదవండి: దేశంలో లక్షల్లో సర్వికల్ క్యాన్సర్ బాధితులు..11వ స్థానంలో తెలంగాణ.!!