సెమిస్టర్ పరీక్షలను బహిష్కరిస్తూ, ఉస్మానియా యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ లా విద్యార్థులు శుక్రవారం క్యాంపస్లో నిరసన తెలిపారు. మూసివేసిన E1 హాస్టల్లోని మెస్ సౌకర్యాలను తిరిగి తెరవాలని డిమాండ్ చేశారు. E1 హాస్టల్లోని మెస్ సదుపాయాన్ని నిర్వాహకులు మూసివేశారు, దీంతో వారు భోజనానికి ఇబ్బందులు పడుతున్నట్టు విద్యార్థులు తెలిపారు. నిరసన సందర్భంగా విద్యార్థులు E1 హాస్టల్లో తాగునీరు మరియు కనీస సౌకర్యాలకు సంబంధించిన సమస్యలను కూడా లేవనెత్తారు.
హాస్టళ్లలో వాష్రూమ్లు నిర్వహించడం లేదని విద్యార్థులు పేర్కొంటూ, ఈ1 హాస్టల్లోని మురుగునీటి వ్యవస్థ మొత్తం మూసుకుపోయిందని, దాని స్థానంలో కొత్త వ్యవస్థను తీసుకురావాలని చెప్పారు.‘హాస్టల్ పరిసరాల్లో విపరీతంగా దోమల బాధ ఉందని చెప్పారు. మెస్, హాస్టల్ సమస్యలపై కళాశాల ప్రిన్సిపాల్, రిజిస్ట్రార్ దృష్టికి తీసుకెళ్లాం. సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చినా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దీంతో సెమిస్టర్ పరీక్షను బహిష్కరించి నిరసనకు దిగాం’’ అని ఏఐఎస్ఎఫ్ ఓయూ అధ్యక్షుడు లెనిన్ తెలిపారు. ఇక నిరసనల కారణంగా ట్రాఫిక్కు అంతరాయం కలగడంతో పోలీసులు రంగంలోకి దిగి విద్యార్థులను అదుపులోకి తీసుకుని సాయంత్రం విడిచిపెట్టారు.