నల్లగొండ- ఖమ్మం- వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు బీఆర్ఎస్ పార్టీ తరపున అభ్యర్థిగా ఏనుగుల రాకేశ్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. ఇవాళ( మంగళవారం) నల్లగొండ జిల్లా కలెక్టరేట్లో రిటర్నింగ్ ఆఫీసర్కు రాకేశ్ రెడ్డి నామినేషన్ పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు జగదీశ్ రెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ పాల్గొన్నారు.
ఏనుగుల రాకేశ్ రెడ్డి సొంతూరు.. హనుమకొండ జిల్లాలోని హాసన్పర్తి మండలం వంగపహాడ్. రాకేశ్ రెడ్డి బిట్స్ పిలానీలో మాస్టర్ మేనేజ్మెంట్ స్టడీస్, మాస్టర్స్ ఇన్ ఫైనాన్స్ చేశారు. స్టడీ తర్వాత సిటీ బ్యాంక్ మేనేజర్గా, జేపీ మోర్గాన్, ఫేస్బుక్ లాంటి పలు అంతర్జాతీయ కార్పోరేట్ కంపెనీల్లో బెంగళూరు, అమెరికాలలో ఏడేళ్ల పాటు ఉన్నతస్థాయిలో ఉద్యోగాలు చేశారు. రాజకీయాలపై ఆసక్తితో రాజకీయాల్లోకి వచ్చారు.
2013లో బీజేపీలో చేరి ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. అంచెలంచెలుగా ఎదుగుతూ బీజేపీలో బీజేవైఎం రాష్ట్ర కార్యదర్శిగా, రెండు పర్యాయాలు రాష్ట్ర అధికార ప్రతినిధిగా పనిచేశారు. ఆ తర్వాత 2023, నవంబర్లో బీఆర్ఎస్ పార్టీలో చేరారు.
యువతలో, విద్యావంతులలో మంచి పట్టున్న రాకేష్ రెడ్డికి రాష్ట్ర వ్యాప్తంగా అభిమానులు, ఫాలోయింగ్ ఉండటంతో పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా కేసీఆర్ ప్రకటించారు.
ఇది కూడా చదవండి:మోడీ..పదేండ్లలో తెలంగాణకు ఏం చేశారో చెప్పి ఓట్లడగండి