ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కేసులో నిందితుడిగా తిహార్ జైలులో ఉన్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు సుప్రీం కోర్టు కీలక సూచన చేసింది. మధ్యంతర బెయిల్ కోసం వేసిన పిటిషన్ ను ఇవాళ(మంగళవారం) విచారించింది సుప్రీం కోర్టు. ఇందులో భాగంగా అరవింద్ కేజ్రీవాల్ కు కీలక సూచన చేసింది. ఈ కేసులో బెయిల్ ఇస్తే సీఎం పదవి బాధ్యతలు నిర్వర్తించవద్దని సుప్రీం కోర్టు తెలిపింది. అయితే దీనిపై కోర్టు ఎలాంటి లిఖిత పూర్వక ఉత్తర్వులు జారీ చేయలేదు. లోక్ సభ ఎన్నికల వేళ ఒక పార్టీ నేతగా ఎన్నికల ప్రచారం చేయాల్సిన అవసరం ఉందని కోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది. మరోవైపు ఢిల్లీలోని రౌజ్ ఎవెన్యూ కోర్టు అరవింద్ కేజ్రీవాల్ జ్యుడీషియల్ కస్టడీని మే 20 వరకు పొడిగించింది.
అరవింద్ కేజ్రీవాల్ ప్రజలు ఎన్నుకున్న సీఎం అని, లోక్ సభ ఎన్నికలు ఐదేళ్లకొకసారి మాత్రమే వస్తాయని ఈ సమయంలో ఒక పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికల ప్రచారం చేసుకోవాల్సిన అవసరం ఉందని ధర్మాసనం వ్యాఖ్యానించింది. అయితే దీనికి ఈడీ తీవ్ర అభ్యంతరం తెలిపింది. సీఎం అయినంత మాత్రాన ప్రత్యేకంగా పరిగణించాల్సిన అవసరం లేదని… ఎందుకంటే రాజకీయనేతలకు మినహాయింపులు ఉండకూడదని, ఈ కేసులో కేజ్రీవాల్ దర్యాప్తునకు అసలు సహకరించలేదని ఈడీ అభ్యంతరం వ్యక్తం చేసింది.
ఒకవేళ బెయిల్ ఇస్తే ఆయన సీఎం పదవీ బాధ్యతలు నిర్వర్తించేందుకు అనుమతించబోమంది ఈడీ. అందుకు కేజ్రీవాల్ తరఫు న్యాయవాది మాట్లాడుతూ…కేజ్రీవాల్ ఎలాంటి ముఖ్యమైన పత్రాలపైనా సంతకాలు చేయరని, ఆకారణంతో లెఫ్టెనెంట్ గవర్నర్ ఆ పేపర్లను రిజక్ట్ చేయకుండా చూడాలని కోరారు. ఇరు పక్షాల వాదనలను విన్న సుప్రీం కోర్టు అరవింద్ కేజ్రీవాల్ కు మధ్యంతర బెయిల్ పై తీర్పును రిజర్వ్ చేసింది.
ఇది కూడా చదవండి:ఎన్నికల వేళ రేవంత్ ప్రభుత్వానికి కేంద్ర ఎన్నికల సంఘం షాక్