కడప కేంద్ర కారాగారంలో జీవితఖైదు అనుభవిస్తున్న మహమ్మద్ రఫీ చదువులో సత్తా చాటాడు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో పీజి కోర్సు చేసి ఫస్ట్ ర్యాంక్ సాధించాడు. అంతేకాదు యూనివర్సిటీ నుంచి గోల్డ్ మెడల్ కూడా అందుకున్నాడు నంద్యాలకు చెందిన మహమ్మద్ రఫీ.
నంద్యాల జిల్లా సంజామల మండలం పేరు సోములకు చెందిన మాబుసా, మాబుని దంపతుల రెండో కుమారుడైన మహమ్మద్ రఫీపై ఓ కేసులో నేరరోపణ రుజువైంది. దీంతో కోర్టు అతడికి జీవిత ఖైదు విధించింది. ప్రస్తుతం ఆయన జైలు జీవితం అనుభవిస్తున్నాడు. కానీ తనకు ఇష్టమైన చదువును కొనసాగించాలని అనుకున్నాడు.
జైలు అధికారుల సహకారంతో తాను అనుకున్నది సాధించాడు. హైదరాబాదులోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం నుంచి దూరవిద్యలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. అత్యధిక మార్కులు సాధించి గోల్డ్ మెడల్ సాధించాడు. ఈ నెల 28న విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ జగదీష్ నుంచి మెడల్ ను అందుకున్నాడు. ఈ మేరకు బెయిల్పై వచ్చి గోల్డ్ మెడల్ అందుకున్న రఫీ ..తర్వాత తిరిగి కడప సెంట్రల్ జైలుకు వెళ్లాడు.
ఇది కూడా చదవండి: బీజేపీ నేత జయప్రద కోసం వెతుకుతున్న పోలీసులు