అవకాశవాదానికి మరో రూపం పొంగులేటి శ్రీనివాస రెడ్డి. జగన్ పార్టీ నుండి బీఆర్ఎస్, అటునుండి కాంగ్రెస్ లో చేరి పదవులు అనుభవిస్తున్నాడు. కాంట్రాక్టర్ కావటంతో సహజంగానే కాంగ్రెస్ గట్టి అవకాశాలు ఇచ్చింది. ఇప్పుడు అలాంటి సొంత పార్టీని కూడా అభాసుపాలు చేసేవిధంగా పొంగులేటి చేసిన వ్యాఖ్యలు రాజకీయాల్లో చర్చనీయాంశం అవుతున్నాయి. సీఎం రేవంత్ అయితే ఎలాగో చంద్రబాబు ఏజెంట్ అని తెలంగాణలో పసిబిడ్డ కూడా చెప్తుంది. ఇప్పుడు ఈ లిస్టులో పొంగులేటి కూడా చేరిపోయాడని అంటున్నారు. నిన్న పొంగులేటి మరీ బరితెగించేశాడని తెలంగాణ ప్రజల నుండి విమర్శలు వస్తున్నాయి. తెలంగాణ వ్యతిరేకుల్లో అగ్రగణ్యుడైన చంద్రబాబు నాయుడు పార్టీతో పొంగులేటి చెట్టాపట్టాలేసుకుని తిరగటం సాటి తెలంగాణ పౌరుడికి కాస్త అవమానంగానే ఉంటుంది. కాంగ్రెస్ జెండాతో గెలిచి చంద్రబాబు దయతోనే గెలిచానని చెప్పి.. తెలంగాణ కాంగ్రెస్ కార్యకర్తల కష్టాన్ని కూడా అవమానపరిచే విధంగా వ్యాఖ్యలు చేశాడు పొంగులేటి.
గురువారం ఖమ్మంలో టీడీపీ నిర్వహించిన ఒక కార్యక్రమానికి హాజరైన పొంగులేటి శ్రీనివాస్రెడ్డి మాట్లాడుతూ.. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపునకు సహకరించినందుకు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు, ఆయన కుమారుడు నారా లోకేశ్తోపాటు టీడీపీ నేతలకు కాంగ్రెస్ పక్షాన ధన్యవాదాలు తెలియజేశారు. టీడీపీ, కాంగ్రెస్ వేర్వేరు కాదని, రెండూ ఒకటేనని స్పష్టం చేశారు. అధికారంలో లేమని తెలుగుదేశం పార్టీ శ్రేణులు డీలా పడొద్దని, భవిష్యత్లో అందరం కలిసి ప్రయాణం చేద్దామని అన్నారు. అయితే కాంగ్రెస్ ముఖ్యనేతలంతా టీడీపీ ఏజెంట్లేనని తాము చేసిన ఆరోపణలు నిజమని చెప్పడానికి పొంగులేటి వ్యాఖ్యలే నిదర్శనమని బీఆర్ఎస్ పార్టీ నేతలు చెప్తున్నారు. లోపాయికారి ఒప్పందంలో భాగంగానే టీడీపీ అసెంబ్లీ ఎన్నికల పోటీ నుంచి తప్పుకొన్నదని, కాంగ్రెస్తో చేతులు కలిపిందని వివరిస్తున్నారు.