దుండిగల్ ఎయిర్ఫోర్స్ అకాడమిలో నేడు జరుగుతున్న కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ డే పరేడ్కు ముఖ్య అతిథిగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పాల్గొన్నారు. ఈ సందర్భంగా క్యాడెట్ల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. రాష్ట్రపతి ముర్ము.. పరేడ్కు రివ్యూయింగ్ అధికారిగా రావడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం. ఈ ప్రోగ్రాం అనంతరం తిరిగి ఉదయం 11.15 గంటలకు బేగంపేట ఎయిర్ పోర్ట్ నుంచి రాష్ట్రపతి ఢిల్లీకి తిరిగి వెళ్లనున్నారు. కాగా.. ఈ కార్యక్రమంలో ఎయిర్ ఛీఫ్ మార్షల్ వీఆర్ చౌదరి, తెలంగాణ గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాల్గొన్నారు.
#WATCH | President Droupadi Murmu reviews the Combined Graduation Parade at the Air Force Academy in Dundigal, Telangana pic.twitter.com/raxZtMMzsd
— ANI (@ANI) June 17, 2023
ఎయిర్ఫోర్స్ అకాడమీలో మొత్తం 119 ఫ్లయింగ్ ఎయిర్ ట్రైనీలు, 75 మంది గ్రౌండ్ డ్యూటీ ట్రైనీ క్యాడెట్లు శిక్షణ పొందారు. మరో 8 మంది క్యాడెట్లు ప్రత్యేక శిక్షణ పూర్తిచేసుకున్నారు. వారిలో ఇద్దరు వియత్నాం దేశానికి చెందిన క్యాడెట్లు కాగా, మిగతా ఆరుగురు నేవీ, కోస్ట్గార్డ్కు చెందినవారు.
ఈ పరేడ్ సందర్భంగా రాష్ట్రపతి ముర్ము మాట్లాడారు. ‘కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్లో పాల్గొన్నందుకు సంతోషంగా ఉంది. ధైర్యవంతులు అయిన క్యాడెట్లను కన్న తల్లిదండ్రులకు శుభాకాంక్షలు. శిక్షణ పూర్తి చేసుకున్న క్యాడెట్లు.. దేశం కోసం ప్రాణాలు అర్పించిన వారి సేవలు గుర్తుంచుకోవాలి. టర్కీలో జరిగిన భూకంప ప్రమాద సమయంలో కూడా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ బాగా పనిచేసింది. కోవిడ్లోనూ చాలా ధైర్యసాహసాలతో ముందుకు దూసుకెళ్లింది. సవాళ్ళను ఎదుర్కొనేందుకు నూతన సాంకేతికతను అందిపుచ్చుకోవాలి. ఏప్రిల్లో సుఖోయ్ జెట్లో ప్రయాణించాను, అది నాకు చాలా గొప్ప అనుభూతి. ఫైటర్ జెట్ పైలట్లలో మహిళలు సైతం అధికంగా ఉండటం సంతోషదాయకం’ అని ముర్ము అన్నారు.