పంజాబ్ రాష్ట్రంలోని సంగ్రూర్ జిల్లాలో కల్తీ మద్యం వ్యవహారం మరోసారి కలకలం రేపుతోంది. కల్తీ మందు తాగి పదుల సంఖ్యలో ఆసుపత్రిలో చేరుతున్నారు. వారిలో ఇప్పటి వరకూ 20 మందికి పైగా చనిపోయారు. ఇథనాల్ కలిపిన నకిలీ మద్యం సేవించి కనీసం 40 మంది ఆసుపత్రిలో చేరారు. అందులో మార్చి 20 బుధవారం నలుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. ఆ మరుసటి రోజు గురువారం నాడు పాటియాలాలోని రాజింద్ర ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరో నలుగురు మరణించారు. శుక్రవారం మరో 8 మంది, శనివారం ఐదుగురు చనిపోయారు. దీంతో కల్తీ మద్యం కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 21కి పెరిగినట్లు సంగ్రూర్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ తెలిపారు.
కేవలం నాలుగు రోజుల వ్యవధిలోనే కల్తీ మద్యం కారణంగా 20 మంది ప్రాణాలు కోల్పోవడం తీవ్ర కలకలం రేపుతోంది. మరోవైపు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసులో ఇప్పటి వరకూ ఇద్దరు వ్యక్తుల్ని అరెస్ట్ చేసినట్లు తెలిపారు.
గతంలో కూడా రాష్ట్రంలో కల్తీ మద్యం సేవించి పలువురు చనిపోయారు. ఏప్రిల్ 2023లో సంగ్రూర్లో నకిలీ మద్యం తాగి ముగ్గురు వ్యక్తులు మరణించారు. అదేవిధంగా 2020 ఆగస్టులో రాష్ట్రంలోని మూడు జిల్లాల్లో లూథియానాకు చెందిన ఓ దుకాణం యజమాని తయారు చేసిన మద్యం తాగి కనీసం 112 మంది ప్రాణాలు కోల్పోయారు.
ఇది కూడా చదవండి: వంటగదిలోనే క్యాన్సర్ దాగుంది! జాగ్రత్త..!