ఎంత చదివితే ఏం లాభం.. కుటుంబానికి కడుపునిండా అన్నం పెట్టలేకపోతే. అందుకే పీహెచ్డీ చదివినా సరే.. కుటుంబపోషణ కోసం సిగ్గుపడకుండా కూరగాయలు అమ్ముతున్నాడు ఓ వ్యక్తి. పంజాబ్లోని పటియాలకు చెందిన 39 ఏండ్ల సందీప్ సింగ్ పీహెచ్డీ చేసి, పంజాబ్ యూనివర్సిటీ లా విభాగంలో 11 ఏండ్లపాటు కాంట్రాక్ట్ ప్రొఫెసర్గా పనిచేశారు. ఉద్యోగం చేస్తూనే పంజాబీ, జర్నలిజం, పొలిటికల్ సైన్స్ సబ్జెక్టుల్లో పీజీ పూర్తిచేశారు. అయితే సమయానికి వేతనాలు సరిగా రాకపోవటం, అందులో కోతలు విధించటంతో కుటుంబపోషణ భారమైంది. దాంతో ఆ కాంట్రాక్ట్ ప్రొఫెసర్ ఉద్యోగాన్ని వదిలేశాడు.
Read Also: మహిళా ప్రయాణికులకు ఆర్టీసీ షాక్.. అక్కడికి వెళ్లేవారు టికెట్ తీసుకోవాల్సిందే
కుటుంబం కోసం ఓ రిక్షా కొనుగోలు చేసి దాని మీద కూరగాయలు అమ్ముతున్నాడు. తన కూరగాయల బండికి ‘పీహెచ్డీ సబ్జీవాలా’ అనే బోర్డ్ కూడా తగిలించాడు. ఉద్యోగం చేసిన దానికంటే ఎక్కువే సంపాదిస్తున్నానని అంటున్నాడు. ‘వేతనం ఎప్పుడు ఇస్తారో తెలియని పరిస్థితి. దాంతో ఆ ఉద్యోగాన్ని వదిలేశాను. కుటుంబ పోషణ కోసం కూరగాయలు అమ్ముతున్నా’ అని సందీప్ సింగ్ చెప్పుకొచ్చారు. అయితే టీచింగ్పై ఉన్న మక్కువ పోలేదని, కొంత డబ్బు పొదుపు చేసి.. ఏదో ఒక రోజు ట్యూషన్ సెంటర్ ప్రారంభిస్తానని తన ఆకాంక్షను వెలిబుచ్చారు. కాంట్రాక్ట్ ప్రొఫెసర్గా కన్నా.. కూరగాయలు అమ్ముతూ ఎక్కువ సంపాదిస్తున్నానని అతడు చేసిన వ్యాఖ్యలు ఇటీవల మీడియాలో వైరల్గా మారాయి.