వెస్ట్ బెంగాల్ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. దాంతో ఒకేసారి 36 వేల మంది టీచర్లు తమ ఉద్యోగాలను కోల్పోయారు. ప్రైమరీ టీచర్ల అపాయింట్మెంట్ ప్రక్రియలో సరైన విధానాలను పాటించలేదని జస్టిస్ అభిజిత్ గంగోపాధ్యాయ 36 వేల మంది టీచర్ల అపాయింట్మెంట్ రద్దు చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. ప్రైమరీ టీచర్ల రిక్రూట్మెంట్లో జరిగిన అవినీతి బెంగాల్ చరిత్రలోనే అతిపెద్దదని ఆయన అన్నారు. 2016లో జరిగిన ఈ రిక్రూట్మెంట్ సమయంలో ఎంపికైన 36 వేల మంది అభ్యర్థులు సరైన రీతిలో శిక్షణ పొందలేదని కోర్టు తన తీర్పులో పేర్కొన్నది.
ఈ కేసులో 17 పేజీల తీర్పును జస్టిస్ గంగోపాధ్యాయ వెలువరించారు. శుక్రవారం రాత్రి 11 గంటలకు ఈ తీర్పును హైకోర్టు వెబ్సైట్లో అప్లోడ్ చేశారు. ఆప్టిట్యూడ్ టెస్ట్లో అభ్యర్థులు విఫలమైనట్లు కోర్టు తెలిపింది. 2014లోని టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ ప్రకారం శిక్షణ జరగలేదని, అందుకే అపాయింట్మెంట్ను రద్దు చేస్తున్నట్లు కోల్కతా హైకోర్టు తెలిపింది.