తెలంగాణలో ఈ నెల 13న లోక్సభ ఎన్నికల పోలింగ్ జరగనుంది. దీంతో హైదరాబాద్లో పోలీసులు ఇప్పటికే అలర్టై అన్ని ఏర్పార్లు చేపట్టడంతో పాటు ఆంక్షలు విధించారు. రోడ్లపై జనం ఎక్కువ మంది గుమిగూడటంపై ఆంక్షలు విధిస్తూ మూడు కమిషనరేట్లకు సంబంధించిన పోలీస్ కమిషనర్లు ఉత్తర్వులు జారీచేశారు. ఈ నెల 11న సాయంత్రం 6 గంటల నుంచి 14న ఉదయం 6 గంటల వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయని తెలిపారు.
పోలింగ్ రోజున కేంద్రాలకు 200 మీటర్ల పరిధిలో 144 సెక్షన్ అమల్లో ఉంటుందని పోలీసులు ప్రకటించారు. పోలింగ్ కేంద్రం పరిధిలో ఐదుగురు అంతకుమించి గుమిగూడవద్దని పోలీసులు స్పష్టం చేశారు. శనివారం సాయంత్రం నుంచి సోమవారం సాయంత్రం వరకు అన్ని రకాల ప్రచార కార్యక్రమాలు నిలిపివేయాలన్నారు.
13వ తేదీన పోలింగ్ కేంద్రానికి వచ్చిన ఓటర్లు రెండు క్యూలైన్లలో నిలబడాలని.. మహిళలకు, పురుషులకు వేర్వేరుగా క్యూలైన్లను ఏర్పాటు చేసినట్ల పోలీసులు తెలిపారు. రెండు కంటే ఎక్కువ లైన్లలో ఉండటాన్ని ఎట్టి పరిస్థితుల్లో అనుమతించబోమన్నారు. ఈ ఆదేశాలను ఉల్లంఘిస్తే చట్టప్రకారం చర్యలు ఉంటాయని పోలీస్ కమిషనర్లు హెచ్చరించారు. ఆంక్షల సమయంలో మైకులు, స్పీకర్ల ద్వారా పాటలు పెట్టడం, ప్రజలను ఉద్దేశించి మాట్లాడటాన్ని నిషేధించారు.
వ్యక్తులు, వర్గాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే ప్లకార్డులు, చిత్రాలు, గుర్తులు ప్రదర్శించడం నిషేధమని తెలిపారు. పోలింగ్ కేంద్రాలకు కిలోమీటర్ దూరంలో కర్రలతో కూడిన జెండాలు, తుపాకులు, మారణాయుధాలతో కన్పిస్తే చర్యలు తీసుకుంటామన్నారు.
ఏ లైసెన్సు కింద అనుమతి ఉన్నప్పటికీ మద్యం అమ్మకాలపై ఆంక్షలు ఉంటాయని స్పష్టంచేశారు పోలీసులు.రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం ముగిసినప్పటి నుంచి పోలింగ్ పూర్తయ్యే వరకు లిక్కర్ అమ్మకాలకు అనుమతి లేదన్నారు. ఈ నెల 11న సాయంత్రం 5 గంటల నుంచి 13న సాయంత్రం 6 వరకు లిక్కర్ షాపులు మూసివేయాలని సీఈవో ఉత్తర్వులు జారీ చేశారు.
అంతేకాదు.. జూన్ 4న ఓట్ల లెక్కింపు సందర్భంగా కూడా సాయంత్రం 5 గంటల వరకు మద్యం దుకాణాలను మూసేయాలని ఆదేశించారు.
ఇది కూడా చదవండి: కాంగ్రెస్ శ్రేణులు..బీఆర్ఎస్ కార్యకర్తల జోలికొస్తే ఊరుకోబోం